
10 Hours Working: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల ప్రజలకు పనిదినాలను తగ్గించాలనే డిమాండ్ పెరుగుతున్నాయి. దీనికి అనుగుణంగా ఇప్పటికే కొన్ని దేశాలు వారానికి పని రోజులు, గంటలను తగ్గించాయి. అయితే ఇండియాలో మాత్రం పరిస్థితులు దీనికి పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజూ పని గంటలకు గరిష్ఠంగా 10 గంటలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. గతంలో ఇది రోజుకు గరిష్ఠంగా 9 గంటలుగా ఉండేది. రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకే ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది. దీనికి అనుగుణంగా లేబర్ చట్టంలో మార్పులు తీసుకొస్తున్నట్లు మంత్రి పార్థసారధి వెల్లడించారు. ఇది పెట్టుబడిదారులతో పాటు ఉద్యోగులకు అనుకూలంగా ఉండేలా చూస్తున్నట్లు చెప్పారు.
అలాగే గతంలో ఓవర్ టైమ్ త్రైమాసిక కాలానికి 75 గంటల వరకు మాత్రమే లేబర్ చట్టాల ప్రకారం అనుమతించబడింది. కానీ ఇప్పుడు దానిని 144 గంటలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. ప్రపంచ స్థాయి చట్టాలను రాష్ట్రంలో అమలుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ప్రస్తుతం మార్పులు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే నైట్ షిఫ్ట్స్ విషయంలో చట్టాలను మార్చటం ద్వారా మహిళలు పనిచేసేందుకు వీలు కల్పించటానికి ఏపీ క్యాబినెట్ అంగీకారం తెలిపింది. ఎక్కువ పనిచేయటం వల్ల ఎక్కువ సంపాదించుకోవచ్చని మంత్రి చెప్పారు.
ఇదిలా ఉండగా దీనిపై చాలా మంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. సీపీఐ స్టేట్ సెక్రటరీ రామకృష్ణ స్పందిస్తూ .. కూటని సర్కార్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల ఆసక్తికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని అన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ ఈనెల 9న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ట్రేడ్ యూనియన్లు నిర్ణయించాయి.