
ఇప్పటివరకు మీరు రోడ్లపై పెట్రోల్, డీజిల్, లిథియం బ్యాటరీలతో నడిచే స్కూటర్లను చూసి ఉంటారు. అయితే త్వరలో కొత్త యుగం రాబోతోంది. అవును త్వరలో ఉప్పుతో నడిచే స్కూటర్లను చూడనున్నారు. ఇప్పటికే చైనాలో, సముద్రపు ఉప్పుతో తయారు చేసిన సోడియం-అయాన్ బ్యాటరీలతో నడిచే స్కూటర్లు ఇప్పుడు రోడ్లపైకి వచ్చేశాయి. ఈ రోజు ఈ స్కూటర్లు ఎలా పని చేస్తాయి? అవి భారతదేశంలోకి ఎప్పుడు ప్రవేశిస్తాయో పూర్తి వివరాలను గురించి తెలుసుకుందాం..
ఈ సాల్ట్ బ్యాటరీ ఎలా పనిచేస్తుంది?
చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పటికీ లిథియం-అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తున్నాయి. ఇవి ఖరీదైనవి, ఛార్జింగ్ చేయడానికి చాలా సమయం తీసుకుంటాయి. అయితే ఈ కొత్త టెక్నాలజీలో..సోడియం (ఉప్పు)తో తయారు చేసిన బ్యాటరీలను ఉపయోగిస్తున్నారు. ఇవి చౌకగా ఉండటమే కాదు త్వరగా ఛార్జ్ అవుతాయి కూడా.. ఈ సాల్ట్ బ్యాటరీలను కేవలం 15 నిమిషాల్లోనే 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని చెబుతున్నారు. అంతేకాదు ఈ బ్యాటరీల ధర లిథియం బ్యాటరీ కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఇది పర్యావరణానికి సురక్షితమైన ఎంపిక కూడా.
సాల్ట్ బ్యాటరీ స్కూటర్ల ధర ఎంత అంటే
ఈ స్కుటర్ల ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు, ఎందుకంటే ఈ స్కూటర్లు చైనాలో మన దేశ కరెన్సీలో రూ. 35,000 నుంచి 51,000 మధ్య లభిస్తున్నాయి. అంటే ఇవి పెట్రోల్ లేదా ఖరీదైన EV స్కూటర్ల కంటే చాలా చౌకగా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.
ఈ టెక్నాలజీ గేమ్ ఛేంజర్గా ఎందుకు మారింది?
లిథియం కొరత, ఖరీదైన మైనింగ్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. లిథియంను అధికంగా వాడటం పర్యావరణానికి హాని కలిగిస్తుంది. అంతేకాదు లిథియంతో పోల్చితే సోడియం సులభంగా లభిస్తుంది, ఇది మహాసముద్రాలలో సమృద్ధిగా లభిస్తుంది. అందువల్ల ఈ బ్యాటరీలు చౌకగా, మన్నికైనవి , పర్యావరణ అనుకూలమైనవిగా ఉన్నాయి.
ఈ స్కూటర్లు భారతదేశానికి ఎప్పుడు వస్తాయి?
భారతదేశంలో ఇప్పటికే ఈ సాల్ట్ బ్యాటరీ స్కూటర్ల తయారీపై పలు కంపెనీలు అంటే ఓలా, అథర్, హీరో ఎలక్ట్రిక్ వంటి కంపెనీలు దృష్టి సారించాయి. ఇప్పుడు ఈ దిశలో తయారీపై దృష్టి పెట్టాయి. ప్రభుత్వం కూడా స్థిరమైన బ్యాటరీ సాంకేతికతపై దృష్టి సారిస్తోంది. మన దేశంలో ఈ స్టాట్ బ్యాటరీ ఇంకా పరిశోధన దశలోనే ఉన్నప్పటికీ.. రాబోయే కొన్ని సంవత్సరాలలో “ఉప్పుతో నడిచే స్కూటర్” భారతదేశ రోడ్లపై కూడా నడుస్తుందని భావిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..