
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఆదివారం తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కేబినెట్లో మొత్తం 6 స్థానాలు ఖాళీ ఉండగా.. జూన 8, ఆదివారం ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీనిపై సాయంత్రానికి రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన రావొచ్చని తెలుస్తోంది.
తెలంగాణ కేబినెట్ విస్తరణపై కొన్ని నెలలుగా ఢిల్లీ స్థాయిలో అనేకసార్లు చర్చలు జరిగాయి. సీఎం, డిప్యూటీ సీఎం సహా అనేక మంది ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకుంది కాంగ్రెస్ హైకమాండ్. కేబినెట్లో చోటు ఆశించే వారి సంఖ్య భారీగా ఉండటంతో.. అనేక సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయిలో నేతల అభిప్రాయాలు తీసుకుని హైకమాండ్కు ఈ మేరకు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది.
కేబినెట్లో చోటు కోసం కొంతమంది నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ప్రేమ్సాగర్రావు, మదన్మోహన్రావు, ఆది శ్రీనివాస్, విజయశాంతి రేసులో ఉన్నారు. నల్లగొండ నుంచి బీసీ కోటాలో బీర్ల ఐలయ్య, ఎస్టీ కోటాలో శంకర్ నాయక్ పేరు కూడా తెరపైకి వస్తోంది. మరోవైపు తమకు కూడా కేబినెట్లో చోటు కల్పించాలని కొద్దిరోజుల నుంచి పలువురు మాదిగ సామాజికవర్గం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుతున్నారు.
రంగారెడ్డి జిల్లాకు కేబినెట్లో కచ్చితంగా ప్రాతినిథ్యం కల్పించాలని పలువురు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కోటాలో మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కువ మంది నేతలు కేబినెట్ రేసులో ఉండటంతో.. ఎలాంటి సమీకరణాలు పరిగణనలోకి తీసుకుని ఈసారి కేబినెట్లో ఎవరికి చోటు దక్కుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.
అయితే మంత్రివర్గ విస్తరణ విషయంలో కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఆశావాహులు అసంతృప్తి చెందకుండా మరో మూడు స్థానాలు ఖాళీ ఉంచాలని నిర్ణయించినట్టు సమాచారం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి