
ఆ వైసీపీ సీనియర్ లీడర్… కూటమి ప్రభుత్వాన్ని బాగా డిస్ట్రబ్ చేస్తున్నారా? ఆ మధ్య కొన్నాళ్ళు కామ్ అయిన నాయకుడు తిరిగి గొంతు సవరించుకోవడాన్ని ప్రభుత్వ పెద్దలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారా? ఎక్కువ మాట్లాడుతున్నాడు… లోపలేసేయండని అంటున్నారా? ఆయనకు సంబంధించిన లూప్హోల్స్ వెదకమని కొందరికి బాధ్యత అప్పగించారా? ఎవరా నాయకుడు? ఏంటా వ్యవహారం? పేర్ని నాని… మాజీ మంత్రి, కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టిడిపి, జనసేనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ నాయకుల్లో పేర్ని నాని కూడా ఒకరు. అలాగే… ఉమ్మడి కృష్ణా నుంచి కొడాలి నాని, జోగి రమేష్ , వల్లభనేని వంశీ… అప్పటి ప్రతిపక్షాల మీద మాటల తూటాలు గట్టిగానే పేల్చారన్న అభిప్రాయం ఉంది. ఇక పవర్ పోయాక కొడాలి నాని ఎక్కడున్నారో కూడా అడ్రస్ లేనట్టు మారిపోగా… వల్లభనేని వంశీ జైల్లో ఉన్నారు. జోగి రమేష్ బయట ఉన్నా.. స్పీడ్ బాగా తగ్గిపోయింది. కానీ…. పేర్ని నాని మాటల స్పీడు మాత్రం తగ్గలేదన్న అభిప్రాయం కూటమి పెద్దల్లో ఉందట. రాష్ట్రంలో అధికారం మారాక… వైసీపీ నేతలపై వరుసగా కేసులు బుక్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొడాలి నానిపై మూడు కేసులు నమోదవగా వల్లభనేని వంశీ మీద 8 కేసులున్నాయి. అనారోగ్యం పేరుతో…. సొంత నియోజక వర్గంలో కూడా అందుబాటులో ఉండటం లేదు కొడాలి. ఇక వంశీ 100 రోజులకు పైగా జైల్లోనే ఉన్నారు. జోగి రమేష్ మీద ఒక కేసు ఉండగా… మరిన్ని కేసులు రిజిస్టర్ అయ్యే దశలో ఉన్నట్టు తెలుస్తోంది. అయినా జోగి పెద్దగా ఎక్కడా మాట్లాడటం లేదు. ఇక పేర్ని నాని, ఆయన కుటుంబ సభ్యుల మీద రేషన్ బియ్యం కేసు ఉంది. దీనికి సంబంధించి నాని, ఆయన భార్య జయసుధకు ఇప్పటికే కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఆ రేషన్ బియ్యం కేసు బుక్ అయి, ముందస్తు బెయిల్ వచ్చే వరకు కొన్ని రోజులు అందుబాటులో లేకుండా పోయారు పేర్ని. కానీ… ముందస్తు బెయిల్ వచ్చాక మళ్లీ స్పీడ్ పెంచినట్టు అంచనా వేస్తున్నారట కూటమి పెద్దలు. జిల్లాకు సంబంధించిన అంశాలతో పాటు జగన్పై వచ్చే విమర్శలకు కూడా పేర్ని నాని ప్రభుత్వానికి పదేపదే కౌంటర్స్ ఇవ్వటం ప్రభుత్వ పెద్దల్ని డిస్టర్బ్ చేస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. దీంతో పేర్ని వాయిస్ని మ్యూట్ చేయడం ఎలాగన్న అంశంపై చర్చ జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆయన మీద ఇప్పటికే రేషన్ బియ్యం మిస్సింగ్ కు సంబంధించి ఒక కేసు నమోదు విచారణ దశలో ఉంది. దీనికి సంబంధించే ముందస్తు బెయిల్ మీద ఉండగా…. ఇతరత్రా ఎక్కడ దొరుకుతారా అని ప్రభుత్వం జల్లెడ పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. జగనన్న ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎన్నికల సమయంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ చేశారనే ఆరోపణలు, పోర్టు కోసం భూములు ఇచ్చిన వారికి పరిహారం చెల్లింపుల్లో ఏమన్నా… అక్రమాలు జరిగాయా అన్న విషయాలపై కూడా ఆరా తీస్తున్నారట. జిల్లాలో వైసీపీ నుంచి స్పీడుగా ఉన్న ఒకే ఒక్క నేత పేర్ని నాని అని, ఆయన ప్రతి విషయంలో తమను అనవసరంగా కార్నర్ చేస్తున్నారన్న అభిప్రాయం ఉందట కూటమిలో. అలాగే… జిల్లాకు చెందిన తమ పార్టీ నాయకులు కూడా పేర్ని నాని మీద సరిగా ఫోకస్ పెట్టడం లేదన్న అభిప్రాయం టీడీపీ అధిష్టానానికి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే… ఆయన్ని కార్నర్ చేయటానికి కారణాలు చూసే బాధ్యతను కొందరు నేతలకు అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది టీడీపీ సర్కిల్స్లో.