
చెన్నై, జూన్ 8: పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ చదువుతున్న ఓ మెడికల్ విద్యార్ధి అనుమానాస్పదంగా కారులో మృతిచెంది కనిపించాడు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన సదరు విద్యార్ధి.. ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్ ఎక్కించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులోని కొడైకెనాల్ కొండ పట్టణం సమీపంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే..
తమిళనాడులోని సేలంలో డాక్టర్ జాషువా సామ్రాజ్ అనే మెడికల్ విద్యార్ధి ఎండీ (డాక్టర్ ఆఫ్ మెడిసిన్) చదువుతున్నాడు. మధురైలోని ఓ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నాడు. కొడైకెనాల్ సమీపంలోని పూంపరైలోని మారుమూల అటవీ ప్రాంతంలో అతని కారు గత మూడు రోజులుగా నిలిపి ఉండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అధికారులు తనిఖీ చేయగా.. కారు ఓపెన్ చేసి చూడగా సామ్రాజ్ మృతి చెంది కనిపించాడు. వాహనం నుంచి ఓ సూసైడ్ నోట్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్లో తన కుటుంబానికి క్షమాపణలు చెప్పాడు. కానీ ఎవరినీ నిందించలేదు. అందులో మృతికి ఎటువంటి కారణం చెప్పలేదు.
పోలీసుల దర్యాప్తుల్లో డాక్టర్ సామ్రాజ్ అప్పుల్లో కూరుకుపోయినట్లు తేలింది. అయితే అంత డబ్బు ఎందుకు అప్పు చేశాడన్నదానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆన్లైన్ గేమింగ్లో డాక్టర్ డబ్బు పోగొట్టుకుని ఉంటాడని సమాచారం. అయితే అందుకు సంబంధించి వివరాలేవీ సూసైడ్ నోట్లో దొరకలేదని పోలీసులు తెలిపారు. మృతుడి తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని నిర్ధారించలేదు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. సామ్రాజ్ కారులో కూర్చుని తనకు తానుగా ఇంట్రావీనస్ ద్రవాలను ఎక్కించుకుని సూసైడ్ చేసుకుని ఉంటాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోస్ట్మార్టం పరీక్ష అనంతరం మరణానికి ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారణ అవుతుందని పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.
Beta feature