
హైదరాబాద్, జూన్ 7: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 జూన్ సెషన్ (యూజీసీ- నెట్) పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం జూన్ 25 నుంచి 29వ తేదీ వరకు రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నాం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహించనున్నారు.
అయితే సరిగ్గా ఇదే తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో మెగా డీఎస్సీ, టెట్ పరీక్షలు జరగనున్నాయి. జూన్ 18, 19, 20, 23, 24, 27, 28, 29, 30 తేదీల్లో తెలంగాణ టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇటీవల విద్యాశాఖ వెల్లడించింది. మరోవైపు జూన్ 6 నుంచి జూన్ 30వ తేదీ వరకు ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షలు జరుగుతున్నాయి. డీఎస్సీ పరీక్షలకు హైదరాబాద్తోపాటు ఏపీలో పరీక్ష కేంద్రాలను కేటాయించారు. టెట్, డీఎస్సీ పరీక్షలు ఒకే తేదీల్లో వచ్చాయని అభ్యర్ధులు తలలు పట్టుకుంటుంటే ఇప్పుడు యూజీసీ నెట్ పరీక్షలు కూడా ఇవే తేదీల్లో రావడంతో అభ్యర్ధులు గందరగోళ పడుతున్నారు. ఒక పరీక్షకు హాజరైతే మిగతా రెండు పరీక్షలు నష్టపోవల్సి ఉంటుంది. ఎంతో కష్టపడి నెలల తరబడి పరీక్షలకు హాజరైతే ఇలా.. ఒకే నెలలో, ఒకటే తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తే ఎలా అంటూ అభ్యర్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యూజీసీ నెట్ (జూన్) షెడ్యూల్ 2025 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా యూజీసీ నెట్ పరీక్ష దేశ వ్యాప్తంగా యేటా రెండు సార్లు నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రతిభకనబరచిన వారికి జూనియర్ రిసెర్చి ఫెలోషిప్ అవార్డు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు, పీహెచ్డీ ప్రవేశాలకు అర్హత వస్తుంది. ఈ పరీక్షను మొత్తం 85 సబ్జెక్టుల్లో ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రానికి సంబంధించిన వివరాలను తెలిపే సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు పరీక్షకు పది రోజుల ముందు అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తామని ఎన్టీఏ ప్రకటించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.