. 2 minutes

ధూపదీప పథకానికి మస్తు దరఖాస్తులు.. 250 ఆలయాల కోసం 3,300 అప్లికేషన్లు

Caption of Image.
  • మే 24తో ముగిసిన గడువు
  • ఒక్కో ఉమ్మడి జిల్లాలో 20 ఆలయాలకు అవకాశం
  • జోరుగా సాగుతున్న ప్రజాప్రతినిధుల పైరవీలు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ధూపదీప నైవేద్య పథకానికి(డీడీఎన్‌ఎస్‌) దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. రాష్ట్రంలో 250 ఆలయాలను డీడీఎన్ పథకంలో భాగంగా ఎంపిక చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్​జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద అర్హతగల ఆలయాల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. అప్లికేషన్ల స్వీకరణకు గత నెల 24వ తేదీతో గడువు ముగిసింది. జిల్లాల వారీగా ఏసీ(అసిస్టెంట్​ కమిషనర్లు)లు దరఖాస్తులను స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా 250 ఆలయాలను ఈ పథకంలో ఎంపిక చేయనుండగా.. ఇందుకోసం దాదాపుగా 3,300 వరకు దరఖాస్తులు వచ్చాయి. 

ఆలయాలు తక్కువగా ఉండటం.. దరఖాస్తులు ఎక్కువగా రావడంతో ఆలయాల ఎంపిక అధికారులకు పెద్ద పరీక్షగా మారింది. ఒక్కో ఉమ్మడి జిల్లాలో 20 ఆలయాల చొప్పున మాత్రమే ఈ పథకంలో ఎంపికయ్యే అవకాశం ఉంది. జిల్లాల్లో ఏసీ (అసిస్టెంట్​ కమిషనర్లు) ఓకే చేసిన ఆలయాలకు మాత్రమే ఈ పథకం వర్తించనున్నట్లు తెలిసింది. 

ప్రతినెలా ఆలయానికి రూ.10 వేలు

రాష్ట్రంలో దేవాదాయ శాఖ.. ధూప దీప నైవేద్య పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని అర్హత కలిగిన ఆలయాలకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఆదాయం లేని ఆలయాల నిర్వహణ, సంప్రదాయ పూజల కోసం డీడీఎన్ పథకంలో నిధులు కేటాయిస్తోంది. డీడీఎన్​పథకం కింద ఎంపికైన ఆలయాలకు నెలకు ప్రభుత్వం రూ.10,000 ఆర్థిక సాయం అందిస్తుంది. 

ఇందులో రూ.7 వేలు అర్చకులకు గౌరవ భృతిగా, రూ.3 వేలు ధూప, దీప, నైవేద్యం వంటి పూజా సామగ్రి కోసం వినియోగించాల్సి ఉంది. గతంలో ఈ పథకంలో రూ.6,000 మాత్రమే వచ్చేవి.రూ.4,000 అర్చకులకు, రూ.2,000 పూజ సామగ్రి కొనుగోలు చేసేవారు. గత బీఆర్ఎస్​ ప్రభుత్వం నిధుల కేటాయింపును రూ.6 వేల నుంచి రూ.10,000లకు పెంచింది.

రూ.25 లక్షల వరకు అదనపు భారం

రాష్ట్రంలో ప్రస్తుతం 6,541 ఆలయాల్లో డీడీఎన్ పథకం అమలు అవుతున్నది. ఇందుకోసం ప్రతినెలా రూ.6.54 కోట్ల నిధులు కేటాయిస్తున్నది. ఇప్పుడు మరో 250 ఆలయాలను ఈ పథకంలో ఎంపిక చేస్తే ప్రభుత్వానికి రూ.25 లక్షల వరకు అదనపు భారం పడనున్నది. ఈ పథకానికి ఎంపిక కావాలంటే 15 ఏండ్ల క్రితం నిర్మించిన గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయమై ఉండాలి. ఎంపికైన ఆలయాలకు దేవాదాయ శాఖ నుంచి నెలనెలా నిధులు మంజూరు అవుతాయి. 

జోరుగా పైరవీలు 

ధూప దీప నైవేద్యం పథకం కోసం జోరుగా పైరవీలు నడుస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు తాము అనుకున్న ఆలయాలను ఈ పథకంలో ఎంపిక చేయాలని ఎండోమెంట్​అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయా ప్రజాప్రతినిధుల లెటర్లను దరఖాస్తులకు జతచేసి పంపించారు.

ప్రస్తుతం ఆయా ఆలయాల బాధ్యులు హైదరాబాద్​లోని ఎండోమెంట్​ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎలాగైనా తమ ఆలయాన్ని డీడీఎన్​ స్కీమ్​లో చేర్చాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎండో మెంట్​ అధికారులు మాత్రం నిబంధనల మేరకే డీడీఎన్​ పథకంలో ఆలయాలను ఎంపిక చేస్తామని చెబుతున్నారు. కాగా, దరఖాస్తులు అధికంగా రావడంతో మరిన్ని ఆలయాలకు అవకాశం కల్పించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు దేవాదాయశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.