
- ఆయనది కరుడుగట్టిన కాంగ్రెస్ కుటుంబం
- రైతు కుటుంబంనుంచి రాజకీయాల్లో రాణించిన శ్రీహరి
మహబూబ్నగర్: ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మినిస్టర్దాకా ఎదిగారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదిలోనే ఆయనను మంత్రి పదవి వరించింది. వాకిటి శ్రీహరిది రైతు కుటుంబం. ప్రస్తుత నారాయణపేట జిల్లాలోని మక్తల్లో నర్సింహులు, రాములమ్మ దంపతులకు ఆయన జన్మించారు. తండ్రి వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించగా.. తల్లి రాములమ్మ నర్సుగా పనిచేసేవారు.
శ్రీహరి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు మక్తల్ గవర్నమెంట్ స్కూల్లో, ఇంటర్, డిగ్రీ పాలమూరులో పూర్తి చేశారు. 2000 ఏప్రిల్ 23న శ్రీహరికి లలితతో వివాహం జరిగింది. భర్త సహకారంతో లలిత కూడా రాజకీయాల్లో రాణిస్తున్నారు. 2006లో దాసర్పల్లి నుంచి ఎంపీటీసీగా పోటీ చేసి గెలుపొందారు. అదే ఏడాది మక్తల్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా 2011 వరకు పని చేశారు.
రాజకీయ ప్రస్థానం..
డిగ్రీ పూర్తి చేశాక వాకిటి శ్రీహరి రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్ఎస్ యూఐ ప్రెసిడెంట్గా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. మొదట 1990–-93 వరకు మక్తల్ మండల ఎన్ఎస్ యూఐ ప్రెసిడెంట్గా, 1993–-96 వరకు మక్తల్ మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, 1996–-2001 వరకు మక్తల్ మండల సెక్రటరీగా, 2001-–06 వరకు మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. 2001లో మక్తల్ మేజర్ గ్రామ పంచాయతీ నుంచి భారీ మెజార్టీతో మొదటిసారి సర్పంచ్గా ఎన్నికయ్యారు.
2010–14లో జరిగిన జడ్పీటీసీ ఎలక్షన్స్లో రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో గెలిచిన జడ్పీటీసీల్లో రెండో స్థానంలో నిలిచారు. 2018 వరకు జడ్పీ ఫ్లోర్ లీడర్గా పని చేశారు. 2022 నుంచి 2024 ఫిబ్రవరి వరకు నారాయణపేట డీసీసీ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ సెగ్మెంట్ నుంచి శ్రీహరి పోటీ చేశారు. తన సమీప అభ్యర్థి చిట్టెం రాంమోహన్ రెడ్డిపై 17,525 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
35 ఏండ్లుగా కాంగ్రెస్ సేవలోనే..
శ్రీహరి కుటుంబం మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. దాదాపు 35 ఏండ్లుగా వీరు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. మధ్యలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా.. గట్టిగా నిల్చున్నారు. ప్రభుత్వాలు మారి ఇబ్బందులు వచ్చినా.. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేశారు. శ్రీహరితోపాటు ఆయన సోదరుడు శేషగిరి కూడా క్రియాశీల రాజకీయాల్లో రాణిస్తున్నారు. 2006లో ఈయన మక్తల్ ఉప సర్పంచ్గా పని చేశారు. అదే ఏడాది మహబూబ్నగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా 2014 వరకు పని చేశారు. మక్తల్ మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అప్గ్రేడ్ కావడంతో శేషగిరి భార్య రాధిక 2019లో మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా గెలుపొంది, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్గా పని చేశారు. ప్రస్తుతం శేషగిరి అన్నతో పాటే ఉంటున్నారు.