
- హైకోర్టు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: అక్రమ నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్, బేగంపేట బీఎస్ మక్తాలో 400 చదరపు గజాల్లో అనుమతి లేకుండా నిర్మించిన బిల్డింగ్లపై చర్యలు తీసుకోవాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని చేగూరి అనిత అండాళ్లు వేసిన పిటిషన్ను కొట్టివేసింది. పిటిషనర్ ఆండాళ్లు, ఆమె కుమారుడు 200 గజాల చొప్పున స్థలాలను కొనుగోలు చేసి విడివిడిగా రెండస్తుల నిర్మాణాలకు అనుమతి తీసుకున్నారు. 400 చదరపు గజాల్లో 4 అంతస్తుల నిర్మాణాలకు అనుమతులను సవరించి కట్టారని వారి తరఫు లాయర్ చెప్పారు.
భవన పటిష్టత, వాస్తు వంటి పేరుతో అయిదో అంతస్తు నిర్మించాక భవన క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈ నిర్మాణాల వల్ల బాధితుడు కాని నరేందర్ అనే వ్యక్తి పిటిషన్ వేస్తే హైకోర్టు గతంలో ఉత్తర్వులు ఇచ్చిందని, వాటిని రద్దు చేయాలని కోరారు. వాదనల తర్వాత.. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేయడానికి బాధితుడై ఉండక్కల్లేదని, ఎవరైనా ఆఖరికి దారినపోయే వ్యక్తి కూడా ఫిర్యాదు చేయవచ్చునని కోర్టు స్పష్టం చేసింది.