
గద్వాల టౌన్, వెలుగు: ఓ దొంగ లారీని ఎత్తుకెళ్లగా, 12 గంటల్లో ఆ లారీని పోలీసులు పట్టుకొచ్చారు. టౌన్ ఎస్సై కల్యాణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల పట్టణంలోని మార్కెట్ యార్డులో గురువారం సాధిక్ తన లారీని గురువారం పార్క్ చేసి ఉంచాడు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అక్కడికి వెళ్లగా, లారీ కనిపించలేదు. లారీ చోరీకి గురైందని గ్రహించిన బాధితుడు వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
సాంకేతిక పరిజ్ఞానంతో ఎంక్వైరీ చేయగా, వనపర్తి, పెబ్బేరు, బిజినేపల్లి, నాగర్ కర్నూల్, బాలానగర్ మీదుగా లారీ వెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే సిబ్బందిని అక్కడికి పంపించి అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో రాయికల్ టోల్ ప్లాజా వద్ద లారీని పట్టుకొని, స్టేషన్ కు తీసుకొచ్చారు. పోలీసులను గమనించిన దొంగ లారీని వదిలి పరారైనట్లు ఎస్సై తెలిపారు. లారీని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సిబ్బంది చంద్రయ్య, కిరణ్, రాజు యాదవ్ ను అభినందించారు. బాధితుడికి లారీని అప్పగిస్తామని ఎస్సై చెప్పారు.