. 2 minutes

finally comes general elections

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్ యూనస్ ఎట్టకేలకు సాధారణ ఎన్నికల నిర్వహణకు ముందుకు రావడం ముదావహం. ఇదిగో అదిగో అంటూ దిక్కుమాలిన సాకులు చూపి, ఎన్నికల నిర్వహణను నెలల తరబడి వాయిదా వేస్తూ వచ్చిన యూనస్ చివరకు అటు ప్రజాస్వామ్యవాదులు, ఇటు సైన్యం ఒత్తిడికి తలవంచక తప్పలేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ ప్రథమార్థంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహిస్తామంటూనే గతంలో ఎన్నికలు పక్షపాతపూరితంగా జరిగాయని గత ప్రభుత్వాధినేత షేక్ హసీనాపై అక్కసు వెళ్లగక్కారు. బంగ్లాదేశ్ ప్రస్తుత సంక్షోభానికి గతంలో జరిగిన పక్షపాతపూరిత ఎన్నికలే కారణమని, తన ప్రభుత్వం మాత్రం స్వేచ్ఛాయుత వాతావరణంలో, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తుందన్నారు. తన తప్పిదాలు కప్పిపుచ్చుకునేందుకు వైరి పక్షంపై నిందలు మోపుతున్న యూనస్, ఎన్నికల నిర్వహణకు 20 నెలల సుదీర్ఘ సమయం దేనికి తీసుకుంటున్నారన్న ప్రశ్నకు ఏం సమాధానం చెబుతారు? ఎటువంటి పాలనానుభవం లేని ఈ పెద్దమనిషికి కుటిల రాజకీయ పరిజ్ఞానం మాత్రం పుష్కలంగానే ఉన్నట్లు గత పదినెలల ఆయన పాలన చెప్పకనే చెబుతోంది.

వెల్లువెత్తిన ప్రజానిరసనల ధాటికి తట్టుకోలేక గత ఏడాది జూన్‌లో అప్పటి ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పరారై ఇండియాకు వచ్చి తలదాచుకున్న అనంతరం బంగ్లాదేశ్‌లో పరిస్థితులు (Conditions in Bangladesh) ఇకనైనా చక్కబడతాయనుకున్న ప్రజాస్వామ్యవాదుల ఆశలను యూనస్ అడియాసలు చేశారనడంలో సందేహం లేదు. హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో బంగ్లా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దానికితోడు హసీనాతో తనకున్న పాత వైరాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆమెకు ఆశ్రయం కల్పించిందన్న అక్కసుతో ఇండియాతో తెగతెంపులు చేసుకోవడానికి కూడా సిద్ధపడటం ఆయన దుందుడుకు వైఖరికి నిదర్శనం. స్వతంత్ర బంగ్లాదేశ్ అవతరణలో కీలకపాత్ర పోషించిన అవామీలీగ్ పార్టీది ఏడున్నర దశాబ్దాల ఘన చరిత్ర. షేక్ హసీనాతో వ్యక్తిగత విభేదాల కారణంగా దేశ తాత్కాలిక సారథి యూనస్ ఆ పార్టీపై ఇటీవల ఉగ్రవాద నిరోధక చట్టం కింద నిషేధం విధించడం ప్రజాస్వామికవాదులను ఆశ్చర్యానికి గురిచేసింది.

బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌లో అవామీలీగ్ నేతలపై నడుస్తున్న కేసుల విచారణ పూర్తయ్యేవరకూ నిషేధం కొనసాగుతుందని యూనస్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో అవామీలీగ్ పోటీ చేసే అవకాశాలు అడుగంటినట్లే. ఎందుకంటే, అప్పటివరకూ విచారణ పూర్తికాకుండా యూనస్ ప్రభుత్వం చేయవలసినదంతా చేస్తుంది. షేక్ హసీనాపై బనాయించిన వందకు పైగా కేసులు ఒక కొలిక్కి రావడానికి ఏళ్లూపూళ్లూ పడుతుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. గత ఏడాది ఆగస్టు 8న బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా పదవీబాధ్యతలు చేపట్టిన యూనస్, అవామీలీగ్ నియంతృత్వ విధానాలనుంచి దేశానికి విముక్తి కల్పించి, దేశాన్ని ప్రజాస్వామిక పంథాలో నడిపిస్తానని శపథం చేశారు.

కానీ పదవి చేపట్టి పదినెలలు దాటినా ఇప్పటికీ పాలనపై పట్టు సాధించలేదు సరికదా శాంతిభద్రతల పరిస్థితి సైతం నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్న చందంగా మారింది. ఆయన పాలనలో విదేశాంగ విధానామూ కప్పదాట్లు తొక్కుతోంది. ఇప్పటివరకూ బంగ్లాదేశ్‌లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇండియాతో స్నేహపూర్వక సంబంధాలనే కోరుకోగా, అందుకు భిన్నంగా యూనస్ కోరి కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ఇండియా సహకారమే లేకపోతే బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ప్రపంచపటంలో స్థానం సంపాదించుకుని ఉండేది కాదన్న ఇంగితం మరచిన బంగ్లా ప్రభుత్వ తాత్కాలిక అధినేత, చైనా, పాకిస్తాన్‌లకు దగ్గరయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలు విస్తుగొలుపుతున్నాయి.

అవామీలీగ్‌పై నిషేధం ఉన్న కారణంగా రాబోయే ఎన్నికల్లో పోటీ ప్రధానంగా మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి), కొత్తగా ఏర్పడిన నేషనల్ సిటిజన్ పార్టీ, జమాత్ ఏ ఇస్లామీల మధ్యే ఉంటుంది. బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బిఎన్‌పి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇండియాతో దౌత్య, వాణిజ్య బంధాలు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, తాజాగా ఆ పార్టీ ఇండియాతో స్నేహసంబంధాలను కోరుకుంటున్నామని ప్రకటించడం ఆహ్వానించదగిన పరిణామం. ఇది ఇండియాకు కూడా కలసివచ్చేదే. ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం చైనా, పాకిస్తాన్‌లతో అంటకాగేందుకు ఉవ్విళ్లూరుతున్న నేపథ్యంలో బిఎన్‌పికి పరోక్షంగా మద్దతు ప్రకటించడం ఇండియాకు అత్యంత ఆవశ్యకం.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.