
భారతదేశం ఉన్నంతవరకూ..భారతజాతి ఉన్నంతవరకూ..భారతీయుల గుండెలు ఉప్పొంగేలా.. భారతీయతను నలుమూలల చాటేలా.. నినాదమై మోగిన యోధుడి జీవిత గాథను తెలిపే అపురూప పుస్తకమిది.
అతడి జీవన పర్యంతం.. దేశ స్వాతంత్య్ర సమరంలో ఎలా భాగమయ్యాడు, భారత స్వాతంత్ర్య సైనికుడిగా ఎలా రూపుదాల్చాడు, యుద్ధభూమిలో శత్రువుల్ని ఎలా ఎదుర్కొన్నాడు.. ఇలా అనేక విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
- దేశభక్తి కలిగిన ఒక యువకుడు చదువు కోసం జర్మనీ వెళ్లి.. నేతాజీతో కలిసి సాగించిన ప్రయాణం, అతడి జీవితాన్ని, ఆశయాన్ని పూర్తిగా మార్చేశాయి.
- రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో.. సుభాస్ చంద్రబోస్ భారత స్వాతంత్య్ర సమరానికి మద్దతు కోరుతూ జర్మనీ వెళ్లారు. ఆ సమయంలో జర్మనీ బ్రిటన్తో యుద్ధం చేస్తోంది. అబిద్ తన ఇంజనీరింగ్ చదువు నిమిత్తం జర్మనీకి వెళ్లాడు. అక్కడ బోస్ను చూసి.. అతడి ప్రసంగాలకు, ఆశయాలకు విశేషంగా ప్రభావితుడై, తన చదువును మధ్యలోనే వదిలేశాడు. తరువాత ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా మారాడు.
- హైదరాబాద్ వాసి.. ముస్లిం విశ్వాసి అయినా.. హిందువులు పవిత్రంగా భావించే కాషాయ రంగును సామరస్యానికి ప్రతీకగా భావించి తన పేరులో ఇముడ్చుకున్న అసలు సిసలు భారతీయుడు ఇతడు. అందుకే అతడ్ని అబిద్ హసన్ గానే కాక అబిద్ హసన్ సఫ్రాని అని పిలిస్తేనే ఇష్టం అంటాడు.
- నాటి ఇండియన్ నేషనల్ ఆర్మీలో భిన్న వర్గాల ప్రజలు ఉండేవారు. కొంతమంది ‘నమస్కార్’ అంటే, మరికొంతమంది ‘రామ్ రామ్’ అని పలకరించుకునేవారు. ‘సత్ శ్రీ అకాల్’, ‘అస్సలామలైకుం’ అంటూ అభివాదం చేసుకునేవారు.
- సెక్యులర్ భావాలు కలిగిన బోస్కు ఇన్ని రకాల అభివాదాలుండటం బొత్తిగా నచ్చలేదు. అందరికీ ఆమోదయోగ్యమైన ఓ అభివాద నినాదాన్ని రూపొందించాలని సహచరులకు సూచించాడు. ఎంతో మథనం తర్వాత అబిద్ బుర్రలో ‘జై హింద్’ పుట్టుకొచ్చింది. అదే భారతీయ స్వాతంత్ర్య సమరానికి సంపూర్ణ నినాదమై నిలిచింది.
- 1945లో బోస్ రష్యాకి ప్రయాణమైనప్పుడు ఆయనతోపాటు మరో ముగ్గురు ప్రయాణించాల్సి ఉంది. అందులో అబిద్ ఒకరు. అయితే ఆ విమాన పైలట్ ఇద్దరి కంటే ఎక్కువమందిని తీసుకువెళ్లనని చెప్పడంతో నేతాజీ అబిద్ను రావద్దని చెప్పారు. లేదంటే, ఆ విమానంలో అబిద్ కూడా ఉండేవారు. సుభాష్ చంద్ర బోస్ను ఆఖరిసారి చూసిన కొద్దిమంది వ్యక్తుల్లో అబిద్ హసన్ ఒకరు.
- జై హింద్ అనే నినాదం కేవలం ఇండియన్ నేషనల్ ఆర్మీకి సంబంధించింది మాత్రమే కాదు. ఇది దేశమంతటికీ సంబంధించిన నినాదం! ఇలాంటి వ్యక్తులను భావి తరాలు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భావి తరాలకు, నేటి యువతరానికి వీరి గురించి తెలుసుకోవాల్సిన అవశ్యకం ఉందని రచయిత తెలియజెప్పడం విశేషం.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.