
న్యూఢిల్లీ: టీమిండియా యంగ్ క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆదివారం (జూన్ 8) ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో రింగ్లు మార్చుకున్నారు రింకు సింగ్, ప్రియా సరోజ్. ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆయన సతీమణి డింపుల్ యాదవ్, జయా బచ్చన్, శివపాల్ యాదవ్, ప్రవీణ్ కుమార్ వంటి సీనియర్ సమాజ్ వాదీ పార్టీ నాయకులు హాజరయ్యారు.
మాజీ క్రికెటర్లు ప్రవీణ్ కుమార్, పీయూష్ చావ్లా, యూపీ రంజీ జట్టు కెప్టెన్ ఆర్యన్ జుయల్ రింకు నిశ్చితార్థ వేడుకకు అటెండ్ అయ్యారు. రింకు, ప్రియాల నిశ్చితార్ధ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. ఇందులో వైట్ కలర్ కోట్లో రింకు, గులాబీ రంగు దుస్తుల్లో ప్రియా మెరిశారు. దీంతో రింకు సింగ్ జోడికి పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
నిశ్చితార్థ వేడుకకు ముందు రింకు సింగ్ తన కుటుంబంతో కలిసి ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లోని చౌధేరా వాలి విచిత్ర దేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు 300 మంది రింకు ఎంగేజ్మెంట్కు హాజరైనట్లు సమాచారం. ప్రాంతీయ, అంతర్జాతీయ రుచులను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా రూపొందించిన శాఖాహార మెనూను అతిథులకు ఏర్పాటు చేశారు. ఇందులో అవధి వంటకాలు, రసగుల్లా, కాజు-పనీర్ రోల్స్ వంటి బెంగాలీ స్వీట్లు, యూరోపియన్ నుండి ఆసియా వంటకాల వరకు వివిధ రకాల ప్రపంచ స్టార్టర్లు విందులో వడ్డించారు.
కాగా, ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన రింకు సింగ్ ప్రస్తుతం ఇండియా టీమిండియా తరుఫున ఆడుతోన్న విషయం తెలిసిందే. ఇక, రింకు సింగ్ వివాహం చేసుకోబోయే ప్రియా సరోజ్ న్యాయవాది, పొలిటిషియన్. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ నుంచి మచ్లిషహర్ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగి ప్రియా సరోజ్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి బీపీ సరోజ్ని 35,850 ఓట్ల తేడాతో ఓడించి, పార్లమెంటు దిగువ సభకు ఎన్నికైన రెండవ అతి పిన్న వయస్కురాలిగా ప్రియా సరోజ్ చరిత్ర సృష్టించింది.
ఆమె యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుండి బిఎ డిగ్రీతో పాటు నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ నుండి LLB పట్టా పొందారు. జూన్ 8న నిశ్చితార్ధం చేసుకున్న రింకు, ప్రియా నవంబర్ 18న పెళ్లి చేసుకుని వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని తాజ్ హోటల్లో సాంప్రదాయ వేడుకలో వివాహం జరగనుంది. క్రికెట్, బాలీవుడ్, వ్యాపార, రాజకీయాలకు చెందిన ప్రముఖులకు హాజరయ్యే అవకాశం ఉంది.