
గోదావరిలో ఈతకు వెళ్లి గల్లంతైన ఆరుగురు జల సమాధి అయ్యారు. శనివారం(జూన్ 07) సాయంత్రం గల్లంతైన వారి మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు నిర్విరామంగా శ్రమించి వెలికి తీశారు. సరదా కోసం వెళ్లి విగతజీవులుగా మారిన చూసి, మృతుల కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నేరుగా విలపించారు. పెళ్లి ఇంట్లో ఊహించని విషాదం అలముకుంది.. రెండు గ్రామాలలో రోదనలు మిన్నంటాయి.
ఈ విషాద సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. అంబటిపల్లి గ్రామంలోని ఒక ఇంట్లో రెండు రోజుల క్రితం పెళ్లి వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో బంధువులు అంతా కలిసి సరదాగా గడిపారు. శనివారం సాయంత్రం ఏడుగురు చిన్నారులు మేడిగడ్డ బ్యారేజ్ చూడడానికి వెళ్లారు. అక్కడ గోదావరిలో ఈతకు వెళ్లి లోతు గమనించ కుండా అందులో మునిగిపోయారు. అలా ఒకరి వెంట మరొకరు మొత్తం ఆరుగురు గల్లంతయ్యారు. ఒడ్డున ఉన్న బాలుడు పరుగులు పెడుతూ వెళ్లి సమీపంలో ఉన్న వారికి సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న వారంతా వారిని కాపాడేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఫలితం దక్కలేదు. అప్పటికే వారంతా గల్లంతయ్యారు.
విషయం తెలిసిన వెంటనే పోలీసులు స్థానిక గజ ఈతగాళ్ళ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం SDRF సిబ్బంది అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.. ఈ క్రమంలో గల్లంతైన ఆరుగురి మృతదేహాలను సహాయక బృందాలు వెలికి తీశాయి. మృతులు మహాదేవపూర్ మండలం అంబట్ పల్లి గ్రామానికి చెందిన రక్షిత్, సాగర్, శివమనోజ్, మహాముత్తారంకు చెందిన రాహుల్, మధుసూదన్, రాంచరణ్ గా గుర్తించారు. ఈతకు వెళ్లి అంతా జల సమాది అయ్యారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం మహదేవాపూర్ ఆస్పత్రికి తరలించారు. పోస్టు మార్టం అనంతరం మృతుల కుటుంబ సభ్యులకు డెడ్ బాడీస్ అప్పగించారు.
పెళ్లి వేడుక జరిగిన రెండు రోజులకే ఆ ఇంట్లో రోదనలు మిన్నంటాయి. మృతుల తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల ఆర్తనాధాలతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. స్థానిక మంత్రి శ్రీధర్ బాబు విచారం వ్యక్తం చేశారు. మీ మృతుల కుటుంబసభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..