టీం ఇండియా మరికొన్ని రోజుల్లో ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో తలపడనుంది. ఈ సిరీస్తో వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్షిప్ 2025-27 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో బిసిసిఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లండ్ సిరీస్లో శుభ్మాన్ గిల్ సారథ్యంలో కొత్త, పాత ప్లేయర్ల కలయికతో ఉన్న జట్టు ఏ విధంగా రాణిస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో భారత స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్ను మారుస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ బాధ్యతలు చూస్తున్న సోహమ్ దేశాయ్ స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన అడ్రియన్ లే రౌక్స్ను నియమించింది. ఇప్పటికే అడ్రియన్ లండన్లో జట్టుతో కలిసి ఆటగాళ్లతో కసరత్తులు చేయిస్తున్నారు.
స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్గా అడ్రియన్కు మంచి అనుభవం ఉంది. గతంలో భారత జట్టుకు ఆయన 2022 జనవరి నుంచి 2023 మే వరకూ సేవలందించారు. అంతేకాక.. గత ఆరు సంవత్సరాలుగా ఐపిఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టుకు కండీషనింగ్ కోచ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వివిధ రకాల వ్యాయామాలు చేయిస్తూ.. ప్లేయర్ల పురోగతిని పర్యవేక్షించారు. న్యూట్రిషన్ గైడెన్స్తో ఆటగాళ్ల ఫిట్నెస్ మెరుగుపడేందుకు కృషి చేశారు. ఈ సీజన్లో పంజాబ్ ఫైనల్స్ వరకూ వెళ్లడంతో టీం ఇండియా స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్గా అడ్రియన్కు అవకాశం లభించింది.