
Pakistan: పాకిస్తాన్ పాలనకు, అణచివేతకు వ్యతిరేకంగా బలూచిస్తాన్ ప్రజలు ఉద్యమిస్తున్నారు. ప్రత్యేక దేశం కోసం బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) వంటి సంస్థలు ఆయుధాలతో పోరాటం చేస్తున్నాయి. అయితే, ఈ ఉద్యమాలను అణచివేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రారంభించింది. జూన్ 4న బలూచిస్తాన్ అసెంబ్లీ ఉగ్రవాద నిరోధక (బలూచిస్తాన్ సవరణ) చట్టం 2025ను ఆమోదించింది. ఇది ఆ ప్రావిన్సులో పనిచేస్తున్న భద్రతా బలగాలకు విస్తృత అధికారాలను కట్టబెడుతోంది. ఈ చట్టంపై హక్కుల సంఘాలు, న్యాయ నిపుణులు, పౌర సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ చట్టం ఈ ప్రాంతంలో అణచివేత, అశాంతిని మరింతగా పెంచుతుందని హెచ్చరించారు.
కొత్త చట్టం ఏం చెబుతోంది..?
ఈ చట్టం పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐతో సహా సైనిక, నిఘా సంస్థలు, ఎటువంటి అధికారిక అభియోగాలు దాఖలు చేయకుండా లేదా కోర్టులో హాజరుపర్చకుండా 90 రోజుల వరకు వ్యక్తుల్ని నిర్భంధించేందుకు అనుమతిస్తుంది. అనుమానం ఉంటే చాలు ఆ వ్యక్తుల్ని ఖైదు చేయవచ్చు. న్యాయ ప్రక్రియ జోక్యం చేసుకోకుండా చట్టాన్ని రూపొందించారు. సోదాలు, ఆస్తుల్ని జప్తు చేయడానికి ముందస్తు న్యాయ అనుమతి లేకుండా ఉత్తర్వులు జారీ చేయవచ్చు.
వివాదాస్పదంగా బిల్లు..
ఈ చట్టం సివిల్ పోలీసింగ్, సైనిక కార్యకలాపాల మధ్య అధికార పరిమితుల్ని చెరిపివేస్తుంది. ముఖ్యంగా బలూచ్ జనాభాను లక్ష్యంగా చేసుకుని సామూహిక నిఘా, అణచివేతకు మార్గం సుగమం చేస్తుందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు.పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ (HRCP) అమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ మరియు స్థానిక వాచ్డాగ్లు వంటి మానవ హక్కుల సంస్థలు ఈ చట్టాన్ని ఖండించాయి. ఇది రాజ్యాంగ రక్షణల్ని, అంతర్జాతీయ చట్టాలను, పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 10ని ఉల్లంఘిస్తుంది.
ఇప్పటికే బెలూచిస్తాన్లో అపహరణలు..
స్వాతంత్ర్యం, హక్కుల కోసం నినదిస్తున్న బలూచ్ ప్రజల్ని పాక్ సైన్యం, ఐఎస్ఐ అపహరిస్తుంది. చాలా మంది కనిపించకుండా పోయారు. వారు ఎక్కడ ఉన్నారనే విషయాలు కూడా తెలియడం లేదు. తప్పిపోయిన వారిలో కొందరు 15-20 ఏళ్లుగా కనిపించలేదు. కొత్త చట్టం ఇప్పుడు ఈ అపహరణాల్ని చట్టబద్ధం చేసింది. చైనాలో ఉయ్ఘర్ ముస్లింలపై ఎలా అణచివేత కొనసాగుతుందో, ఇప్పుడు బలూచిస్తాన్లో అదే విధంగా ప్రజలపై దారుణాలు సాగుతాయి.
చట్టాన్ని సమర్థిస్తున్న పాక్..
ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను బలోపేతం చేయడం అవసరమని వాదిస్తూ ప్రభుత్వం చట్టాన్ని సమర్థించింది. ఈ బిల్లు రాష్ట్ర వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్న వారిని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుందని, చట్టాన్ని గౌరవించే పౌరులు భయపడాల్సిన అవసరం లేదని ఒక ప్రాంతీయ ప్రతినిధి పేర్కొన్నారు.