గ్రామ దేవతలకు భిన్న రూపాలు కనిపిస్తుంటాయి. కానీ పశ్చిమగోదావరిజిల్లా మొగళ్తూరు ప్రాంతం లోని ముత్యాలపల్లి గ్రామంలో శ్రీ బండి ముత్యాలమ్మ కు విగ్రహం, రూపం ఉండదు. తాటి చెట్టు మొదలును అమ్మవారిగా భక్తులు కొలుస్తారు. ఘనంగా జరుగుతున్న ఉత్సవాలని నిర్వహిస్తారు. తీర ప్రాంత ప్రజల ఆరాధ్య దేవతగా వెలుగొందుతున్న శ్రీ బండి ముత్యాలమ్మ అమ్మవారు కు విగ్రహం గానీ రూపం గానీ లేదు తాడిచెట్టు మొదలు నీ అమ్మవారిగా పూజలు చేస్తూ ఉంటారు.
తాడి చెట్టు చుట్టూ నిర్మించిన ప్రాకారమే ఆలయముగా విరాజిల్లుతుంది. భక్తులు కోరిన కోరికలు తీరుతుండటంతో తీర ప్రాంత వాసులే కాక రాష్ట్రవ్యాప్తంగా అమ్మవారిని భక్తులు కొలుస్తున్నారు . ఈ అమ్మవారి జాతర మూడు సంవత్సరాల ఒకసారి ఘనంగా నెల రోజులు పాటు నిర్వహిస్తారు . ఈ జాతరలో అన్ని వర్గాల ప్రజలు మమేకమవుతారు. ఈ జాతరలో ఉభయ గోదావరి జిల్లాల నుండే కాక తెలంగాణ రాష్ట్రం నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుని వెళ్తారు
ఆలయ నిర్మాణం ఎలా జరిగింది: బ్రిటిష్ పాలనలో ముత్యాలపల్లి గ్రామానికి చెందిన కరణం, మునసబులుగా చెన్నాప్రగడ, దాసరి వంశీ యలు ఉండేవారు. ముత్యాలపల్లి ప్రాంతంలో వసూలు చేసిన నాణాల రూపంలో ఉండే పన్నుల మొత్తాన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి జమ చేసేందుకు జలమార్గం ద్వారా మద్రాసు వెళ్ళారు. వీరు అక్కడ ఒక సత్రంలో బసచేసి శిస్తు చెల్లిం చాల్సిన నాణాలు లెక్కించగా నాలుగు నాణాలు తగ్గాయి. నాణాలు తక్కువ కావడంతో వారు వాటిని ఎలా సమకూర్చాలంటూ ఆలోచిస్తూ నిద్రలోకి జారుకోగా బండి ముత్యాలమ్మ వీరికి కలలోకి వచ్చి నా పేరు బండి ముత్యాలమ్మను మీరు పడుకున్న సత్రం ఎదురుగా ఉన్నాను. నన్ను మీతో తీసుకువెళ్ళండి అని అమ్మవారు ఆదేశించారు.
నిద్రలేచిన కరణం, మునసబులు తిరిగి నాణాలు లెక్కించుకోగా అవి సరిపోయాయి. ఇది అమ్మవారి మహిమగా వారు గుర్తించారు. అయితే అమ్మవారి రూపం ఎలా గుర్తించాలో తెలియలేదు. వారు తిరుగు ప్రయాణంలో మద్రాసు నుండి విజయవాడకు చేరు కొని అక్కడ పడవ ప్రయాణంతో ముత్యాలపల్లి కి బయలుదేరగా పడవ నిండా మట్టిరాళ్ళు కనిపించాయి. వాటిలో మూడు రాళ్ళు ప్రత్యేకంగా ఉండటంతో వాటిని అమ్మవారి రూపంగా భావించారు.
మరలా అమ్మవారు కనిపించి వీటిని ముత్యాలపల్లి గ్రామంలో ఈశాన్యం మూలగా ఉన్న పొన్నాలవారి తోటలోని తాడిచెట్టుకింద ప్రతిష్టించమని ఆదేశించడంతో మొదటి రాయిని ముత్యా లమ్మగా, రెండవ రాయి మారెమ్మ గానూ, మూడవ రాయి పోతు రాజుగా బావించి ప్రతిష్టించారు. అప్పటి నుండి తాడి చెట్టు రూపంలో అమ్మవారు పూజలందుకుంటున్నారు.
తీర ప్రాంత ప్రజ లు తమ ఇంట్లో జరిగే శుభకార్యములు ముందుగా అమ్మవారి కి పూజ చేయడం అమ్మ వారీ పాదాలు వద్ద పెళ్ళి, గృహప్రవేశాలు, ఇతర ఆహ్వన పత్రాలు పెట్టి పూజించి తర్వాత వాటిని బంధువులకు పంపిణీ చేస్తారు. అలాగే ముత్యాలపల్లి ప్రాంతంలో ఎక్కువగా తమ పిల్లలకు ముత్యాలమ్మ, లేదా ముత్యారావు, మత్యాలరాజు ఇలా అమ్మవారి పేరు వచ్చేలా తమ బిడ్డలకు నామకరణం చేస్తుంటారు.ముత్యాలపల్లి బండి ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహో త్సవాలు ప్రతీ మూడు సంవత్సరాలకు ఒకసారి నాలుగవ సంవత్సరం రాకుండా నిర్వహించడం ఆనవాయితీ.
జాతర కు ముందు అమ్మవారిని నిలబెట్టే పూరి గుడిసే, పందిర రాడ్డులు, తోరణాలు కట్టడం, అఖండ జ్యోతి వెలిగించడం, అమ్మవారిని సాగనంపడం, మొదటి మొక్కుబడి తీర్చడం తదితర విషయాల్లో కుల భేదం లేకుండా పలు సామాజిక వర్గాలు తమ తమ విధులు నిర్వహించడం ఆనవాయితీ. మే 13న మొదలైన జాతర మహోత్సవాలు, 25వ తేదీ నుంచి ఆలయం వద్ద ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈనెల 9వ తేది రాత్రి జరిగే జాతరకు సుమారు పది లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఆలయం వద్ద భారీ విద్యుత్ దీపాలంకరణలతో పాటు స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. 9 వ తేదీ రాత్రి అమ్మవారిని బండిపై ఉంచి గ్రామంలో తిప్పుతారు అనంతరం భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు.