
Devendra Fadnavis: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లోని శరద్ పవార్ వర్గం, శివసేన (యూబీటీ) ఉద్ధవ్ వర్గాల కూటమి ఊహించని ఓటమిని చవి చూసిందని పేర్కొన్నారు. అలాగే, కాంగ్రెస్ను ప్రజలు తిరస్కరించారు, అందుకే వారు ఇప్పుడు ఈవీఎంలను తప్పుబడుతూ, ప్రజాస్వామ్య ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆయన ఆరోపించారు. మహారాష్ట్రలో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ ఈవీఎంలపై ప్రశ్నలు లేవనెత్తడం ప్రతిపక్ష పార్టీలకు అలవాటుగా మారిపోయిందని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ వైఫల్యాన్ని అంగీకరించలేని వ్యక్తి అని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు.
Read Also: Pakistan: పాక్కు ఉగ్రవాద నిరోధక కమిటీ వైస్ ఛైర్మన్ హోదా.. సభ్య దేశాలు అభ్యంతరం..
అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలు సరైనవేనా? అని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎన్సీపీలోని శరద్ పవార్ వర్గం, ఉద్ధవ్ థాకరే శివసేనల మహా వికాస్ అఘాడి కూటమి నవంబర్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు కేవలం 46 చోట్ల మాత్రమే విజయం సాధించింది. అప్పటి, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, బీజేపీల మహాయుతి కూటమి దాదాపు 235 సీట్లను కైవసం చేసుకుంది. ఇందులో భారతీయ జనతా పార్టీకి 132 స్థానాల్లో గెలిచింది. ఇది ఆ రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డు అని చెప్పాలి.