
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చెన్నారెడ్డిపల్లికి చెందిన రామకృష్ణ అనే రైతు ఇటీవల తన బంగారు నగలు తాకట్టు పెట్టి బ్యాంకులో రూ. 86 వేలు లోన్ తీసుకున్నాడు. ఈ డబ్బును బైక్ ముందు కవర్లో పెట్టుకుని వెళ్తూ మధ్యలో భోజనం కోసం ఆగాడు. ఈ సమయంలో ఓ వ్యక్తి అతడిని అనుసరిచి వాహనంలో ఉన్న డబ్బును దొంగిలించాడు. రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించి నిందితుడు శ్రీనివాసపురం వీధిలోకి వెళ్లినట్లు గుర్తించారు. ముందు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించి.. ఆ తర్వాత నిందితుడు అతను కాదని నిర్ధారించుకుని వదిలేశారు. కేసు విచారణలో ఉన్నారు పోలీసులు.
శుక్రవారం (జూన్ 6, 2025) ఉదయం శ్రీనివాసపురం ప్రాంతంలో పంచాయతీ చెత్త సేకరణ బండి వెళ్లింది. చెత్త పోస్తున్న రాయదుర్గం సురేష్ అనే వ్యక్తి పాలిథిన్ కవర్లో కరెన్సీ నోట్ల కట్టలు ఉండటం గుర్తించాడు. తీసుకుని ఓపెన్ చేసి చూడగా.. రూ. 86 వేల నగదు, బ్యాంక్ పాస్బుక్, పాన్కార్డు ఉన్నాయి. సురేష్ వెంటనే ఆ నగదును, పాస్బుక్, పాన్కార్డును స్థానిక ఎస్సై హనీఫ్కు అప్పగించాడు. ఎస్సై హనీఫ్ సురేష్ నిజాయితీని ప్రశంసించి రూ. 1000 బహుమతి ఇచ్చారు. పాస్బుక్ ఆధారంగా డబ్బు రామకృష్ణదేనని నిర్ధారించి అతనికి అప్పగించారు. సురేష్ మంచి మనసు, నిజాయితీని అందరూ ప్రశంసిస్తున్నారు. చోరీకి గురైన నగదు తిరిగి తనకు చేరడంతో ఆ రైతు ఊపిరి పిల్చుకున్నాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..