. < 1 minute
Car Insurance: బీమా విషయంలో ఐఆర్‌డీఏఐ కీలక నిర్ణయం.. కార్ల బీమా ధరలు పెంపు?

భారతదేశంలో ఇన్సూరెన్స్ కంపెనీలను రెగ్యూలేట్ చేసే ఐఆర్‌డీఏఐ ఇటీవల మోటరు వాహనాల ప్రీమియాన్ని 18 శాతం పెంపును సూచించింది. కొన్ని వాహన వర్గాలపై 20 నుంచి 25 శాతం వరకు పెంచాలని పేర్కొంది. ఈ ప్రతిపాదనపై రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుంది. రాబోయే 2 నుంచి 3 వారాల్లోపు ఈ పెంపు ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆమోదం పొందిన తర్వాత ప్రజల సంప్రదింపుల కోసం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ తర్వాత అమలుకు ముందు సమీక్ష ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ వార్తల నేపథ్యంలో బీమా కంపెనీల షేర్లు పెరిగాయి. ఐసీఐసీఐ లాంబార్డ్ షేర్లు 7 శాతం పెరిగాయి. గత మూడు నెలల్లో అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. గో డిజిట్ ఇన్సూరెన్స్ షేర్లు దాదాపు 5 శాతం పెరిగాయి. ఇది గత ఆరు నెలల్లో అత్యధిక స్థాయిని సూచిస్తుంది. అదే సమయంలో న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ షేర్లు దాదాపు 2 శాతం పెరిగాయి.

రోడ్డు ప్రమాదంలో మూడోపక్ష బీమా మన వాహనం ద్వారా మూడో పక్షానికి జరిగే నష్టాన్ని భర్తీ చేస్తుంది. మీ వాహనం వల్ల ఒక వ్యక్తి గాయపడితే లేదా వారి ఆస్తికి నష్టం జరిగితే దాని ఖర్చులను కవర్ చేస్తుంది. మోటారు వాహన చట్టం, 1988 ప్రకారం ఈ బీమా తప్పనిసరి. మీ వాహనం వల్ల మరొకరికి హాని జరిగితే బీమా కంపెనీ ఖర్చులను భరిస్తుందని నిర్ధారిస్తుంది. గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ రంగంలో వివిధ అనిశ్చితులు ఉన్నప్పటికీ ప్రీమియంలో ఎలాంటి మార్పు లేదు. 20 శాతం ప్రీమియం పెంపుదల బీమా కంపెనీల పనితీరును మెరుగుపరుస్తుందని, ఈ రంగానికి ఉపశమనం కలిగించగలదని నిపుణులు భావిస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి, కార్లు, ద్విచక్ర వాహనాలు సహా ప్రైవేట్ వాహనాలకు ఇంజిన్ సామర్థ్యం (సిసి) ఆధారంగా ప్రతిపాదిత పెంపుదలలను ఐఆర్‌డీఏఐ వివరించింది.

ప్రైవేట్ వాహనాల్లో ప్రధానంగా ప్రైవేట్ కార్లు మరియు ద్విచక్ర వాహనాలు ఉంటాయి. ఇంజిన్ సామర్థ్యం (సీసీ) ఆధారంగా ఐఆర్‌డీఏఐ ప్రీమియంను నిర్ణయిస్తుంది. 1000 సీసీ వరకు ఉన్న ప్రైవేట్ కార్లకు ప్రస్తుత ప్రీమియం రూ.2,094గా ఉంటే 18 శాతం పెరుగుదలతో ఇది రూ.2,471కి పెరుగుతుంది. అలాగే 25 శాతం పెరుగుదలతో ఇది రూ.2,618కి పెరుగుతుంది. 1000 సీసీ, 1500 సీసీ మధ్య ఇంజిన్ సామర్థ్యం ఉన్న కార్లకు, ప్రస్తుత ప్రీమియం రూ.3,416గా ఉంటే 18 శాతం పెరుగుదలతో ఇది రూ.4,031కి చేరుకుంటుంది. 25 శాతం పెరుగుదలతో ఇది రూ.4,270కి పెరుగుతుంది. 1500 సీసీ కంటే ఎక్కువ ఉన్న కార్లకు ప్రస్తుత ప్రీమియం రూ.7,897గా ఉంటే 18 పెరుగుదలతో ఇది రూ.9,318గా మారుతుంది. 25% పెరుగుదలతో ఇది రూ.9,871కి చేరుకుంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.