
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అయిన చినాబ్ బ్రిడ్జి నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు ఓ తెలుగు మహిళా ఇంజనీర్ ఆవిడే డా.జి .మాధవీలత. ఉధమ్పూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ (USBRL)లో భాగంగా ఉన్న చినాబ్ వంతెన రెండు ఎత్తైన కొండల నడుమ విల్లు ఆకారంతో అత్యంత ఎత్తున ఇనుముతో నిర్మించిన ఇంజనీరింగ్ అద్భుతం చినాబ్ వంతెన. 21 ఏళ్ల పాటు సాగిన ఈ రైల్వే వంతెన నిర్మాణంలో హిమాలయ ప్రాంతంలోని సంక్లిష్ట భౌగోళిక పరిస్థితులను అధిగమించడంలో తెలుగు మహిళ ఇంజనీర్ పాత్ర, నైపుణ్యం కీలకంగా ఉంది. 2005 నుంచి 2022 వరకు 17 సంవత్సరాల పాటు మాధవి లత చినాబ్ ప్రాజెక్టులో నార్తర్న్ రైల్వే కాంట్రాక్టర్ అఫ్కాన్స్తో కలిసి పనిచేశారు. జియోటెక్నికల్ కన్సల్టెంట్గా సేవలందించారు.
ప్రాజెక్టు నిర్మాణం కీలక పాత్ర
ప్రాజెక్టు నిర్మాణ సమయంలో స్థిరమైన డిజైన్ లేకుండా, మాధవీలత బృందం డిజైన్-అస్-యు-గో విధానాన్ని అవలంబించింది. పగుళ్ల రాళ్లు, దాచిన కుహరాలు, అనూహ్య భౌగోళిక పరిస్థితులను ఎదుర్కొంటూ రియల్-టైమ్లో డిజైన్లను సవరించారు. సీస్మిక్ జోన్లో ఉన్న చినాబ్ వంతెన 120 సంవత్సరాల పాటు ఉండేలా, గంటకు 260 కిలో మీటర్ల వేగంతో వచ్చే గాలులు, భూకంపాలను తట్టుకునేలా నిర్మితం కావడంలో స్లోప్ స్టెబిలిటీ, రాక్ యాంకర్స్, ఫౌండేషన్ డిజైన్లలో ఆమె సలహాలు అమలు చేయడం జరిగింది.
ఎవరీ మాధవి లత ?
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని యడుగుండ్లపాడు గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించిన మాధవి, JNTU నుంచి B.Tech, NIT వరంగల్ నుంచి M.Tech (గోల్డ్ మెడల్), IIT మద్రాస్ నుంచి Ph.D (2000) పూర్తి చేశారు. 2003 నుంచి IIScలో ప్రొఫెసర్గా, ప్రస్తుతం సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ చైర్పర్సన్గా ఉన్నారు. 2021లో ఇండియన్ జియోటెక్నికల్ సొసైటీ నుంచి బెస్ట్ ఉమెన్ జియోటెక్నికల్ రీసెర్చర్ అవార్డు సైతం అందుకున్నారు. 2022లో భారతదేశంలోని టాప్ 75 ఉమెన్ ఇన్ STEAMలో చోటు దక్కించుకున్నారు.
ప్రస్తుతం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లో జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. IIScలో మొదటి మహిళా ఫ్యాకల్టీగా, జియోటెక్నికల్ ఇంజనీరింగ్ భవనంలో మహిళల కోసం టాయిలెట్ సౌకర్యం కోసం మాధవీలత పోరాడారు. ఆమె ల్యాబ్ను మహిళా విద్యార్థులకు సమాన అవకాశాల కల్పనకు కృషి చేశారు. 2007లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి టీచర్ ఎక్స్ట్రాఆర్డినరీ అవార్డును మాధవీలత అందుకున్నారు. తెలుగు సంతతికి చెందిన మాధవి లత, ఒకప్పుడు డాక్టర్ కావాలని కలలు కన్నారు. కానీ ఇంజనీరింగ్ వైపు మళ్ళీ చినాబ్ వంతెన నిర్మాణంలో చారిత్రక విజయాన్ని సాధించారు.
చినాబ్ వంతెన
చినాబ్ బ్రిడ్జి కాశ్మీర్ లోయలో సంవత్సరం పొడవునా రైలు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది, శ్రీనగర్-జమ్మూ హైవే ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. సరిహద్దు ప్రాంతాలకు సైనిక లాజిస్టిక్స్ను వేగవంతం చేస్తుంది. 359 మీటర్ల ఎత్తుతో (ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ), 1.3 కిలోమీటర్ల పొడవుతో, రూ. 1,486 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ వంతెన భారత రైల్వేల చరిత్రలో కీలక ముందడుగు..ఇంజనీరింగ్ అద్భుతం మాధవి లత 17 ఏళ్ల అంకితభావం, సాంకేతిక నైపుణ్యం ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని సాకారం చేసింది. మహిళలు STEMలో నాయకత్వం వహించడానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..