
Janasena: పిఠాపురం మండలంలోని పక్రుద్దీన్ పాలెం పాపిడి దొడ్డి చెరువు వద్ద మట్టి తవ్వకాలు ముదిరి జనసేన పార్టీలోని నేతకు రెండు వర్గాలుగా చీలిపోయి వీధికెక్కే స్థాయికి వెళ్లింది. విరవ గ్రామానికి చెందిన మాజీ ఎంపిపి కురుమళ్ళ రాంబాబుపై, విరవాడకు చెందిన పలువురు జనసేన నాయకులు దాడి చేశారంటూ పిఠాపురం రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఈ వివాదం వాస్తవానికి ఇటుక బట్టీలకు మట్టి తరలింపు విషయంలో ప్రారంభమైంది. చెరువులో మట్టి తవ్వకాలకు అవసరమైన అధికార అనుమతుల కోసం విరవ గ్రామస్తులు ప్రయత్నిస్తుండగా, మట్టి తరలింపు మాత్రం విరవాడకు చెందిన ఇటుక బట్టి యజమానుల పేరుతో సాగుతోందన్న అభ్యంతరం లేచింది.
Read Also: French Open 2025 Final: ఫ్రెంచ్ ఓపెన్లో సంచలనం.. స్టార్ ఆటగాడి ఆశలపై నీళ్లు..!
ఈ నేపథ్యంలో, అనుమతుల కోసం కష్టపడింది మేమే, కానీ మట్టిని తరలించేది మాత్రం మీరు ఎలా? అంటూ మాజీ ఎంపిపి రాంబాబు, విరవ గ్రామానికి చెందిన జనసేన నాయకులతో కలిసి వచ్చి విరవాడ బట్టి యజమానులను నిలదీశారు. దీనికి ప్రతిస్పందనగా, మా ఊరి చెరువులో మట్టి తవ్వడానికి మీకు హక్కుందా? అంటూ విరవాడ నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.
Read Also: SSMB-29 : మహేశ్-రాజమౌళి మూవీ కోసం క్రేజీ యాక్టర్..?
ఇక ఈ వివాదం వాగ్వాదాన్ని దాటి, ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఆ తర్వాత రెండు వర్గాల నేతలు పరస్పరం ఫిర్యాదులతో పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ ఘటనతో పిఠాపురం రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చెరువులో మట్టి తవ్వకాలకు సంబంధించి ఉన్న అనుమతులు, తవ్వకాలపై విచారణ చేస్తున్నట్లు సమాచారం.