. 2 minutes
Rinku Singh Engagement Video: అంగరంగ వైభవంగా రింకూ సింగ్ ఎంగేజ్‌మెంట్.. ఫొటోలు చూశారా?

Rinku Singh Gets Engaged To Politician Priya Saroj: టీమిండియా స్టార్ క్రికెటర్ రింకు సింగ్, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో లక్నోలో జరిగిన ఒక గ్రాండ్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ కార్యక్రమం శనివారం, జూన్ 8, 2025న లక్నోలోని ది సెంట్రమ్ అనే 5-స్టార్ హోటల్‌లో చాలా ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థానికి క్రికెట్, రాజకీయ రంగాల నుంచి ప్రముఖులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

అంగరంగ వైభవంగా వేడుక..

రింకు సింగ్, ప్రియా సరోజ్ ఇద్దరూ తెలుపు, గులాబీ రంగుల దుస్తులలో మెరిసిపోయారు. వీరి రాకతో ఫుల్క్రన్ హాల్ ఉత్సాహభరితమైన వాతావరణంతో నిండిపోయింది. హాల్ అంతా పూల అలంకరణలు, ప్రకాశవంతమైన లైట్లతో అద్భుతంగా ముస్తాబైంది. 300 మందికి పైగా అతిథులు హాజరయ్యే సామర్థ్యం గల ఈ వేదికపై క్రికెట్ దిగ్గజాలు, రాజకీయ ప్రముఖులు సందడి చేశారు.

ప్రముఖుల హాజరు..

ఈ నిశ్చితార్థానికి మాజీ క్రికెటర్లు ప్రవీణ్ కుమార్, పీయూష్ చావ్లా, ఉత్తరప్రదేశ్ రంజీ జట్టు కెప్టెన్ ఆర్యన్ జుయల్ హాజరయ్యారు. రాజకీయ ప్రముఖులలో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎంపీ డింపుల్ యాదవ్, ప్రియా సరోజ్‌కు సన్నిహితురాలైన మరో పార్లమెంటేరియన్ ఇక్ర హసన్, సీనియర్ సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్, కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ శుక్లా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

నిశ్చితార్థ వేడుక విశేషాలు..

రింగుల మార్పిడి కోసం ఒక గ్రాండ్ 12×16 అడుగుల స్టేజ్ ఏర్పాటు చేశారు. లక్నో వంటకాలతో పాటు, ఈ జంట స్వయంగా ఎంపిక చేసుకున్న అనేక వంటకాలతో కూడిన మెనూను అతిథులు ఆస్వాదించారు. అతిథుల సౌకర్యార్థం, ది సెంట్రమ్‌లో 15 రూమ్‌లు బుక్ చేశారు. రింకు సింగ్‌కు సన్నిహితుల కోసం ప్రత్యేకంగా 5 రూమ్‌లు కేటాయించారు. బార్‌కోడెడ్ పాస్‌లు ఉన్న అతిథులకు మాత్రమే ప్రవేశం కల్పించారు.

రింకు సింగ్, ప్రియా సరోజ్ గురించి..

రింకు సింగ్: 27 ఏళ్ల రింకు సింగ్ భారత క్రికెట్ జట్టులో కీలకమైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్. ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడే రింకు 2023లో గుజరాత్ టైటాన్స్‌పై ఒకే ఓవర్‌లో ఐదు సిక్సులు కొట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దేశీయ క్రికెట్ లో కూడా ఆయన మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.

ప్రియా సరోజ్: 26 ఏళ్ల ప్రియా సరోజ్, సమాజ్ వాదీ పార్టీ తరపున మచ్లీషహర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె ఉత్తరప్రదేశ్‌లో అతి పిన్న వయస్కురాలైన ఎంపీలలో ఒకరిగా నిలిచారు. ఆమె తండ్రి తూఫానీ సరోజ్ కూడా మూడుసార్లు ఎంపీగా, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో BA డిగ్రీని, అమిటీ యూనివర్సిటీలో LLB డిగ్రీని పూర్తి చేసిన ప్రియా, రాజకీయాల్లోకి రాకముందు సుప్రీం కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.

ఈ నిశ్చితార్థంతో క్రీడా, రాజకీయ రంగాల కలయికగా ఈ జంట నిలిచింది. వీరి వివాహం నవంబర్ 18, 2025న వారణాసిలో జరగనుంది. ఈ శుభ సందర్భంలో రింకు సింగ్, ప్రియా సరోజ్‌లకు అభిమానులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.