
BC Janardhan Reddy: నంద్యాల జిల్లాలోని కోవెలకుంట్ల ప్రాంతంలో రహదారి అభివృద్ధికి మరింత ఊతమిచ్చే దిశగా కీలక అడుగు పడింది. నంద్యాల జిల్లాలోని కోవెలకుంట్ల వద్ద జాతీయ రహదారి NH-167K పేవ్డ్ షోల్డర్స్తో కూడిన రెండు వరుసల రహదారి విస్తరణ పనులకు రాష్ట్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా జేసీబీ యంత్రాన్ని ఆపరేట్ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు.
Read Also: Anantapur: దారుణ హత్య.. ఇంటర్ విద్యార్థినిని పెట్రోల్ పోసి కాల్చిన దుండగులు..!
ఈ రహదారి విస్తరణ మొత్తం 62.01 కిలోమీటర్ల పొడవు జరగనుందని, దీని కోసం రూ. 691.81 కోట్ల నిధులు మంజూరయ్యాయని మంత్రి వివరించారు. అలాగే మరో రూ. 5 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా రహదారి నిర్మాణ పనులకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం రెండు సమాంతరంగా సాగాలన్నదే మా కూటమి ప్రభుత్వ లక్ష్యమని బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల మెరుగైన జీవనోపాధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు సంక్షేమ పథకాల అమలుపై తమ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉందన్నారు.
Read Also: Rinku Singh Engagement: ఘనంగా రింకూ – ప్రియా సరోజ ఎంగేజ్మెంట్.. కన్నీళ్లు పెట్టుకున్న ఎంపీ..!
ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బీసీ జనార్దన్ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేశారు. వెన్నుపోటు పొడిచారని మా మీద విమర్శలు చేయడం ఏమో కానీ.. ఓటు అనే ఆయుధంతో ప్రజలే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు ఓ పత్రికను అడ్డం పెట్టుకొని తమపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని వదిలి వెళ్లిన పరిశ్రమలు, ఇప్పుడు తిరిగి రావడానికి ఉత్సాహం చూపిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతోందని ఆయన తెలిపారు. “సూపర్ సిక్స్” పేరుతో చేపట్టిన పథకాల్లోని ముఖ్యమైన కార్యక్రమాలు త్వరలో అమలులోకి వస్తాయని మంత్రి తెలిపారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సుప్రయాణం వంటి పథకాలను త్వరలో ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.