
చెన్నై: తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం (జూన్ 8) మధురైలో బీజేపీ ఆఫీస్ బేరర్లను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ.. 2026లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. 2026 నాటికి బెంగాల్ మమతా బెనర్జీ పాలన, తమిళనాడులో డీఎంకే పాలన ముగుస్తోందని జోస్యం చెప్పారు. తమిళనాడులో అధికార డీఎంకె ప్రభుత్వాన్ని గద్దె దించి రాష్ట్ర రాజకీయాల్లో నూతన శకానికి నాంది పలుకుతామన్నారు.
2026లో తమిళనాడులో బీజేపీ–అన్నాడీఎంకే కూటమి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత డీఎంకే పాలనను “100 శాతం వైఫల్యం” అని అమిత్ అభివర్ణించారు. నేను ఢిల్లీలో నివసిస్తున్నప్పటికీ.. నా చెవులు ఎప్పుడూ తమిళనాడు వైపే ఉంటాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా డీఎంకేను ఓడించలేరని సీఎం స్టాలిన్ అంటున్నారు.. ఆయన చెప్పింది నిజమే. డీఎంకేను నేను కాదు తమిళనాడు ప్రజలే ఓడిస్తారన్నారు. పార్లమెంటులో సెంగోల్ను ప్రతిష్టించడం ద్వారా ప్రధాని మోడీ తమిళనాడును గౌరవించారని.. దీనికి ధన్యవాదాలు తెలిపేందుకు తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రధానమంత్రికి లేఖ రాస్తారని ఆశిస్తున్నానని అన్నారు.
పశ్చిమ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గద్దె దించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. కాగా, 2026లో తమిళనాడు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో విజయం బీజేపీకి ఎప్పటి నుంచో అందని ద్రాక్షగా మిగిలిపోయింది. దీంతో ఎలాగైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాల్లో విజయం సాధించి కాషాయ జెండా రెపరెపలాడించాలని బీజేపీ వ్యూహాలు మొదలుపెట్టింది.