. 2 minutes

కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ వద్దకు తాను దోషిగా వెళ్లలేదని, సాక్షిగానే వెళ్లానని మల్కాజ్‌గిరి ఎంపి ఈటల రాజేందర్ అన్నారు. ఆ సమయంలో ఆర్థిక మంత్రిగా ఉన్నావంట కదా నువ్వు తప్పకుండా కమిషన్ ముందుకు సాక్షిగా రావాలని అన్నారని తెలిపారు. నేను తప్పకుండా వస్తాను, మా పార్టీ, కమిషన్ మీద నమ్మకం ఉన్న పార్టీ అని చెప్పి వెళ్లాను, తప్పు చేసిన వారికి శిక్ష పడాలి అనే కోరుకునే పార్టీ మాదని అన్నారు. ఆదివారం జరిగిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యశాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈటల రాజేందర్ మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో ఎక్కడ వెతికినా ఒక్క స్కాం కూడా కనపడదని అన్నారు. కాంగ్రెస్ అంటేనే దొంగల పార్టీ అన్న ఈటల సొంత మంత్రులే జైలుకు పోయారని తెలిపారు. 50 లక్షల ప్రజలు, 30 లక్షల ఓట్లు కలిగిన జిల్లా మన మల్కాజ్గిరి జిల్లాలో తనను అత్యధిక మెజారిటీతో కూడా గెలిపించింది మీరేనని అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వాళ్లు మన మీద దాడి చేస్తారు, ఈ దాడులను తిప్పి కొట్టే సత్తా మీకే ఉండాలని కార్యకర్తలు,

నాయకులను ఉద్దేశించి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక తప్పులు, ఎన్నో డీవియేషన్ జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది, నీకు నీతి నిజాయితీ ఉంటే కమిషన్ రిపోర్ట్‌ను బయట పెట్టాలని, మీకు చేతకాకపోతే సిబిఐకి అప్పగించండి దోషులకు శిక్ష పడేలా చేస్తామని పేర్కొన్నారు. ఇప్పుడున్న కమిషన్‌ను ఆరుసార్లు పొడిగించారు, ఈ పరిస్థితుల్లో దోషులను బయట పెట్టకపోతే మీకు శిక్ష తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 2021లో తాను టిఆర్‌ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చాను అని అంటున్నారు కానీ నన్ను మెడ పెట్టుకొని కేసీఆర్ బయటకు గెంటాడని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కష్ట కాలంలో పరపతి మించి తాను సర్వీస్ చేసిన విషయం గుర్తు తెచ్చుకోవాలని కోరారు. ఒకటే రాత్రిలో తాను దొంగ ఎలా అయ్యానో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. హైడ్రా, మూసి పేరుతో ఇల్లు కూలగొడతా ఉంటే మూడు నెలలపాటు బస్తీల వెంట తిరిగి వారి ఆవేదన విన్నామని తెలిపారు. నల్ల చెరువులో బుచ్చమ్మ సూసైడ్ చేసుకున్న తర్వాత ప్రజలకు ఏం జరుగుతుందో అర్థమైందని తెలిపారు. హైడ్రా, మూసి, లగచర్లలాంటి ఘటనలతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ధ్వజమెత్తారు.

నిజాయితీతో నిబద్ధతతో ఉన్న పార్టీ మాది
నిజాయితీతో, నిబద్ధతతో ఉన్న పార్టీ తమదని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా ప్రజల పక్షాన నిలబడి వారికి తోడుగా ఉంటూ వారికోసం పోరాటం చేస్తుందని ఈటల తెలిపారు. ఆ పార్టీని చూశాం ఈ పార్టీని చూశాం రాబోయే కాలంలో మాకు కావలసింది భారతీయ జనతా పార్టీ అని ప్రజలు అంటున్నారు. 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత దేశం నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఎదిగేలా మోడీ చేశారని తెలిపారు. రాబోయే కాలంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. ప్రజలకు అవసరమైన పని ఏదైనా ఉంటే నాట్ పాసిబుల్ అనేది మన డిక్షనరీలో ఉండొద్దు, మనం ఎప్పుడు వారికి అందుబాటులో ఉండాలని సూచించారు. నా డివిజన్ అధ్యక్షుడు నార్త్‌లో ఒక ఎమ్మెల్యే కంటే ఎక్కువ అని అన్నారు. వారు 24 గంటలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండకపోతే ఆ డివిజన్‌లో పార్టీ వృద్ధి చెందడానికి ఆస్కారం లేదని అన్నారు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు మనం నిప్పులాగా ఉండాలి సందర్భం వస్తే మాత్రం పులిబిడ్డ లాగా మాట్లాడాలని బిజెపి కార్యకర్తలకు ఈటల హితబోధ చేశారు.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.