. 2 minutes
Sunil Narang: చార్జ్ తీసుకుని 24 గంటలు గడవకముందే రాజీనామా చేసిన సునీల్ నారంగ్

సింగిల్ థియేటర్స్ ఇష్యూ మరో మలుపు తిరిగింది. శనివారం తెలంగాణ ఫిలిం చాంబర్‌ ఆఫ్ కామర్స్‌కు అధ్యక్షుడిగా ఎన్నికైనా.. సునీల్ నారంగ్ 24 గంటలు కూడా గడవక ముందే తన పదవికి రాజీనామా చేశారు. తనకు సంబంధం లేకపోయినా వివాదంలోకి తన పేరు పదే పదే లాగుతున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.

గతంలో బంద్‌కు కారణం ఆ నలుగురే అంటూ జరిగిన ప్రచారం కూడా సునీల్ నారంగ్‌ను ఇబ్బంది పెట్టింది. ఆ నలుగురిలో సునీల్ ఉన్నారన్న వార్తలు ఆయన బాధపెట్టాయి. అల్లు అరవింద్‌, దిల్ రాజు లాంటి వాళ్లు ఈ కామెంట్స్‌ మీద స్పందించినా.. అప్పట్లో సునీల్ మాత్రం స్పందించలేదు.

ఛాంబర్‌ కామర్స్‌ కొత్త కార్యవర్గం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో శ్రీధర్‌ చేసిన వ్యాఖ్యలు సునీల్‌ను మరింత ఇబ్బంది పెట్టాయి. స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ శ్రీధర్ మాట్లాడటం ఆ కామెంట్స్‌ సునీల్ చేయించారన్న ప్రచారం జరగటంతో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఎగ్జిక్యూటివ్ కమిటీ రాజీనామా లేఖ అందజేశారు.

అసలు ఈ వివాదం అంతా జూన్ 1 నుంచి థియేటర్లు బంద్‌ చేస్తారన్న వార్తలు రావటంతో మొదలైంది. చిన్న సినిమాలకు ఇస్తున్నట్టుగానే పెద్ద సినిమాలకు కూడా పర్సెంటేజీ ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు ఎగ్జిబిటర్స్. ఆ డిమాండ్ ఇండస్ట్రీని రెండు వర్గాలుగా చీల్చేసింది. ఒక్కరొక్కరుగా సినీ పెద్దలు వివాదంతో మాకెలాంటి సంబంధం లేదంటూ తప్పుకుంటున్నారు.

అసలు ఈ థియేటర్స్ బంద్ ఇష్యూకు బీజం పడింది ఏప్రిల్ 19న తూర్పు గోదావరి జిల్లాలో. అక్కడ అనుశ్రీ ఫిల్మ్స్ సత్యనారాయణ అనే ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబ్యూటర్ థియేటర్స్ బంద్ అనే విషయాన్ని మొదటిసారిగా తెరపైకి తీసుకొచ్చారు.

ఈస్ట్‌లో మొదలైన ఈ తుఫాన్ తీరం దాటి నైజాంకు వచ్చింది. తమకు పర్సెంటేజ్ ఇవ్వకపోతే థియేటర్స్ బంద్ చేస్తామంటూ అక్కడే మొదలైంది వివాదం. అది హైదరాబాద్‌కు వచ్చేసరికి.. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్‌తో ఛాంబర్ పలు దఫాలుగా చర్చించింది. కానీ ఫలితం మాత్రం దిల్ రాజు చెప్పినట్లు శూన్యం. ఈ పర్సెంటేజ్, రెంట్ కారణంగా ఇండస్ట్రీలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్స్ మధ్య చీలికలు వచ్చాయి.

ఎగ్జిబిటర్స్ సమస్యలు చర్చించడానికే జనరల్ బాడీలో ఓ కమిటీ వేస్తామని ఛాంబర్ ప్రకటన చేస్తూ.. మే 24న మీటింగ్ పెట్టి చర్చలు జరిపిన తర్వాత.. మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటామంటూ ప్రకటన చేసింది. అదే రోజు సాయంత్రం పవన్ ఆఫీస్ నుంచి ఘాటుగా ఒక లేఖ వచ్చింది. వెంటనే మే 25న అల్లు అరవింద్, 26న దిల్ రాజు ప్రెస్ మీట్స్ పెట్టి.. ఆ నలుగురులో మేము లేము.. పవన్ సినిమాను ఆపే దమ్ము ఎవరికీ లేదని చెప్పారు. థియేటర్స్ నిర్వహణ ఖర్చు పెరగడం.. ప్రేక్షకుల సంఖ్య తగ్గడం.. ఓటిటికి సినిమాలు త్వరగా రావడం వల్ల తమకు నష్టం జరుగుతుందనేది థియేటర్ల ఓనర్ల వాదన.

ఈ డిమాండ్స్ అన్నీ పక్కకెళ్లిపోయి సినీ పెద్దలంతా ఒకరిపై ఒకరు బురద జల్లుకునే పరిస్థితి నెలకొంది. ఏప్రిల్ 19 నుంచి మే 27 వరకు అంటే దాదాపు 40 రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం చివరికి.. దిల్ రాజు చెప్పినట్లుగానే ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం థియేటర్ ఆక్యుపెన్సీ పెంచడం.. బడ్జెట్ కంట్రోలింగ్ మినహా మార్గం కనిపించట్లేదు. ఆ వైపుగా నిర్మాతలు ఆలోచిస్తే బెటర్.

 

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.