
మృగశిర కార్తె.. జ్యోతిశాస్త్రం ప్రకారం సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే సమయాన్నే మృగశిర కార్తె అంటారు. తెలుగు ప్రజలు ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ కాలంలో వర్షాలు మొదలై, వాతావరణం చల్లబడుతుంది. రైతులు ఈ సమయంలో పొలాలు దున్ని, పంటలు వేయడం ప్రారంభిస్తారు. అయితే మృగశిర కార్తె అనగానే చాలా మందికి హైదరాబాద్లో బత్తిన వంశస్థులు పంపిణీ చేసే చేప ప్రసాదం గుర్తుకువస్తుంది. చేప ప్రసాదం తినడం వల్ల ఆస్తమా, ఉబ్బసం వంటి రోగాలు నయమవుతాయని గత కొన్నేళ్లుగా ప్రజలు నమ్ముతూ వస్తున్నారు. అంతేకాదు.. ప్రతి ఏటా చేప మందు కోసం వచ్చే రోగుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. దీంతో జీహెచ్ఎంసీ, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఏర్పాట్లు, సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. చేప మందు కోసం వచ్చే వారికి కావాల్సిన అల్పాహారం, భోజనం, తాగునీరు సమకూరుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తారు. రవాణా సమస్యలు రాకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తారు. రోగులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. చేప మందు పంపిణీకి ప్రత్యేక సిబ్బందిని నియమిస్తారు. అయితే, ఇంతకీ ఈ చేప ప్రసాదం అంటే ఏంటో తెలుసా..?
చేప ప్రసాదం అనేది ప్రత్యేకంగా తయారు చేయబడిన ఒక మందు. ఆస్తమా, ఉబ్బసం, దగ్గుదమ్ము వంటి శ్వాసకోశ సమస్యలకు బత్తిని సోదరులు ప్రత్యేకంగా తయారు చేసి, ఉచితంగా బాధితులకు పంపిణీ చేస్తారు. ఇందులో కొర్రమీను చేపలు, బెల్లం, మూలికలు ఉంటాయని సమాచారం. 170 ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. కాగా, మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ ఏడాది జూన్ 8, 9 తేదీల్లో ఉచితంగా పంపిణీ చేస్తారు.
అయితే, గతంలో హైదరాబాద్లోని పాతబస్తీలో మొదట్లో ఈ చేప మందు పంపిణీ చేసేవారట. భద్రతా కారణాల వల్ల దీనిని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కు మార్చారు. రోగులు ఒకటి రెండు రోజుల ముందుగానే గ్రౌండ్కు చేరుకుంటారు. అక్కడ స్టాల్స్లో కొర్రమీను చేప పిల్లలను విక్రయిస్తారు. చేప ప్రసాదం కోసం డబ్బులిచ్చి చేప పిల్లలను కొనుగోలు చేస్తే సరిపోతుంది. ఈ ప్రసాదం ఆస్తమా, శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..