
వాతావరణం కాస్త చల్లబడేసరికి వేడి వేడిగా లేదా కారంగా ఏదైనా తినాలని నోరు ఉవ్విళ్లూరుతుంటుంది చాలామందికి. అలాంటప్పుడు రొయ్యలతో చేసిన రెసిపీలు తిన్నారంటే ఎప్పటికీ మర్చిపోరు.
మళ్లీ మళ్లీ తినాలనిపించే రొయ్యల పచ్చడి, వేపుడుతో పాటు గోల్డెన్ ప్రాన్స్ పడదు అనేవాళ్లు కూడా ఇష్టంగా తింటారు. మరింకెందుకాలస్యం వెంటనే ఈ రొయ్యల రెసిపీలపై ఓ లుక్కేయండి.
నిల్వ పచ్చడి
కావాల్సినవి :
రొయ్యలు – ముప్పావు కిలో
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 100 గ్రాములు
ఉప్పు, నూనె, చింతపండు పులుసు లేదా
నిమ్మరసం – సరిపడా
కారం – 75 గ్రాములు
ఆవపిండి – ఒక టేబుల్ స్పూన్
మెంతి పొడి –
పావు టేబుల్ స్పూన్
ధనియాల పొడి – రెండు టేబుల్ స్పూన్లు
తయారీ : ముందుగా రొయ్యల్ని ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత వాటిని ఒక పాన్లో వేసి అందులో ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి నీళ్లన్నీ ఇంకిపోయేవరకు వేగించాలి. మరో పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి అందులో ఆల్రెడీ వేగించిన రొయ్యల్ని వేసి మరోసారి వేగించాలి (డీప్ ఫ్రై). వాటిని ఒక ప్లేట్లోకి తీసిన తర్వాత అదే నూనెలో అల్లం, వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసి వేగించాలి. తర్వాత అందులో ఆవపొడి, మెంతి పొడి వేసి కలపాలి. కాసేపయ్యాక కారం, ధనియాల పొడి, చింతపండు పులుసు లేదా నిమ్మరసం, ఉప్పు కూడా వేసి కలపాలి. ఆ మిశ్రమంలో రొయ్యల్ని కూడా వేసి కలపాలి.
గోల్డెన్ ప్రాన్స్
కావాల్సినవి :
రొయ్యలు – అర కిలో
ఉప్పు – సరిపడా
మిరియాల పొడి –
ముప్పావు టీస్పూన్
మైదా – ఒక కప్పు
కోడిగుడ్లు – రెండు
బ్రెడ్ క్రంబ్స్ – అర కప్పు
నూనె – వేగించడానికి సరిపడా
తయారీ :రొయ్యల్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గిన్నెలో వేసి అందులో పావు టీస్పూన్ మిరియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. మూతపెట్టి అరగంట పాటు పక్కన పెట్టాలి. మరో గిన్నెలో మైదా, ఉప్పు, మిగతా మిరియాల పొడి వేసి కలపాలి. అలాగే బ్రెడ్ క్రంబ్స్లో కూడా వేసి కలపాలి. కోడిగుడ్లను సపరేట్గా గిలకొట్టి పక్కన ఉంచాలి. మారినేట్ చేసిన రొయ్యల్ని ముందుగా మైదా పిండిలో వేసి కలపాలి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా తీసి కోడిగుడ్డు సొనలో ముంచి, బ్రెడ్ క్రంబ్స్లో దొర్లించాలి. అలా రెడీ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని గంటసేపు ఫ్రిజ్లో పెట్టాలి. చివరిగా పాన్లో నూనె వేడి చేసి ఫ్రిజ్లో పెట్టిన రొయ్యల్ని వేసి గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేవరకు వేగించాలి. క్రిస్పీ క్రిస్పీగా ఉండే గోల్డెన్ ప్రాన్స్ ఎన్ని తిన్నా తినాలనిపిస్తూనే ఉంటుంది.
వేపుడు
కావాల్సినవి :రొయ్యలు – అరకిలో
నిమ్మరసం, ధనియాల పొడి,
వెల్లుల్లి తరుగు – ఒక్కో టీస్పూన్
కారం – ఒకటిన్నర టీస్పూన్, పసుపు,
జీలకర్ర, గరం మసాలా – ఒక్కోటి పావు టీస్పూన్ చొప్పున, ఉప్పు – సరిపడా
నూనె – మూడు టేబుల్ స్పూన్లు, ఉల్లిగడ్డలు (చిన్నవి) – పన్నెండు
కరివేపాకు – కొంచెం
అల్లం, వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
టొమాటో – ఒకటి
కశ్మీరీ కారం – ముప్పావు టీస్పూన్
మిరియాలు – అర టీస్పూన్
కొత్తిమీర – కొంచెం
తయారీ : రొయ్యల్ని శుభ్రంగా కడిగి, నిమ్మరసం, కారం, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి కాసేపు పక్కన పెట్టాలి. పాన్లో నూనె వేడి చేసి అందులో మారినేట్ చేసిన రొయ్యల్ని వేసి వేగించాలి. మరో పాన్లో నూనె వేడి చేసి ఉల్లిగడ్డ తరుగు, కరివేపాకు వేసి వేగించాలి. అవి వేగాక అల్లంవెల్లుల్లి పేస్ట్, టొమాటో తరుగు వేసి మరికాసేపు వేగనివ్వాలి. ఆపై కారం, ధనియాల పొడి, కశ్మీరీ కారం, జీలకర్ర పొడి, వెల్లుల్లి తరుగు వేసి కలపాలి. ఆ మిశ్రమంలో వేగించి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసి కలపాలి. మూతపెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరగా గరం మసాలా, మిరియాల పొడి, కొత్తిమీర వేసి మరోసారి కలపాలి.