
పద్మారావు నగర్, వెలుగు: భర్తతో గొడవ పడి పుట్టింటికి వచ్చిన ఓ యువతి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడగా, రక్షించేందుకు ప్రయత్నించిన ఆమె తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. బేగంపేట పాటిగడ్డకు చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ అలీకి కుమార్తె ఆలియా బేగం(26) ఉంది. ఆమెను ఫతేనగర్కు చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ ఆసీఫ్కు ఇచ్చి పెండ్లి చేశాడు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉండగా, కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన ఆలియా మూడు రోజుల కింద పాటిగడ్డలోని తన పుట్టింటికి వచ్చింది.
శనివారం ఆత్మహత్య చేసుకునేందుకు సంజీవయ్య పార్క్ రైల్వేస్టేషన్ సమీపంలోకి రాగా, ఆమెను అడ్డుకునేందుకు తండ్రి మహ్మద్ అలీ కూడా వెళ్లాడు. పట్టాలపై ఉన్న బిడ్డను రక్షించేందుకు తండ్రి ప్రయత్నిస్తున్న సమయంలో సికింద్రాబాద్ నుంచి నాంపల్లి వైపు వెళ్తున్న రైలు ఇంజిన్ వారిని ఢీకొట్టింది. దీంతో ఆలియా బేగం అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.