
చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఖరారు కావడంతో మంచిర్యాల జిల్లా,పెద్దపల్లి, చెన్నూరులో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. జైపూర్ మండల కేంద్రంలో బాణా సంచాలు కాల్చి సంబురాలు జరుపుకున్నారు కాంగ్రెస్ శ్రేణులు. మచ్చ లేని నాయకుడు, పేద ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం పని చేసే నాయకుడు వివేక్ వెంకటస్వామి అని ఎమ్మెల్యే సేవలను కొనియాడారు నాయకులు. వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రాకుండా ఎంతో మంది అడ్డుకున్నా ఆయన చేసిన సేవలను గుర్తించి అధిష్టానం మంత్రి పదవి ఇచ్చిందన్నారు.
15 ఏళ్ల పొలిటికల్ జర్నీ తర్వాత తనకు మంత్రి పదవి వచ్చిందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకస్వామి. మంత్రి పదవి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తనకు ఫోన్ చేసి చెప్పారన్నారు. ఏ శాఖ ఇచ్చినా న్యాయం చేస్తానని చెప్పారు. తెలంగాణ సాధనలో ఎంతో కీలక పాత్ర పోషించానని చెప్పారు. కాకాస్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానన చెప్పారు. బీఆర్ఎస్ నిరంకుశ పాలనపై ఎంతో పోరాడానన్నారు. ప్రజాపాలనలో అన్ని వర్గాలకు చోటు దక్కుతుందన్నారు వివేక్.
కాకా అడుగు జాడల్లోనే పేద ప్రజలకు సేవ చేస్తున్నానని చెప్పారు వివేక్. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో నిర్భందాలు అనుభవించానన్నారు. ఉద్యమ సమయంలో తన వ్యాపారాలను దెబ్బకొట్టాలని చూశారని చెప్పారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సేవ కొనసాగించానన్నారు వివేక్.
►ALSO READ | మంత్రి వర్గ విస్తరణలో కాంగ్రెస్ సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములా
జూన్ 8న మధ్యాహ్నం 12:19 గంటలకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వీళ్లతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. వీళ్లతో పాటు డిప్యూటీ స్పీకర్ గా రామచంద్రు నాయక్ ప్రమాణం చేయనున్నారు.