
జనగామ జిల్లాలో ఓ వివాహిత అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. తాను చనిపోతున్నట్లు లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం రాయిపల్లి గ్రామానికి చెందిన శృతి(22) అనే వివాహిత భర్త వేధింపులతో తాళలేక పోయింది. మానసిక వేదనకు గురైన శృతి దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలోని తన తల్లి గారి ఇంటికి ఈ నెల 3న వచ్చింది. ఈ నెల 6 న తెల్లవారుజామున 3 గంటలకు తన 20 నెలల పాపను ఇంట్లో వదిలి శృతి వెళ్ళిపోయింది. భర్త వేధింపులతో తాను చనిపోతున్నట్లు ఓ లెటర్ రాసి వెళ్లింది.
Also Read:Post Office RD Scheme: జస్ట్ రూ. 5000 పొదుపు చేస్తె చాలు.. లక్షాధికారి అయ్యే ఛాన్స్!
కుటుంబ సభ్యులు నిద్ర లేచి చూసే సరికి శృతి ఇంట్లో కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. వెంటనే చుట్టు పక్కల ప్రాంతాల్లో బంధువుల ఇళ్లలో వెతకడం ప్రారంభించారు. శృతి తల్లిదండ్రులు రెండురోజులుగా వెతుకుతున్నారు. ఇప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. తల్లీ పాల కోసం అలమటిస్తున్న 20 నెలల పసి పాప జాహ్నవి. ఈ క్రమంలో వివాహిత తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.