. 5 minutes
Top Headlines 1pm On 8th June 2025

మహిళలు బయటకు వచ్చే వరకు ప్రభుత్వం స్పందించలేదు:
రాజధాని మహిళలను కించపరిచేలా జర్నలిస్ట్ అని చెప్పుకునే కృష్ణంరాజు నీచంగా మాట్లాడారని కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. నాలుగేళ్లు అలుపెరగని పోరాటం చేసిన మహిళలను దూషిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరలా మహిళలు పోరాటం చేయాల్సిన పరిస్థితికి తెచ్చారన్నారు. ఇంత జరిగినా రాజధాని మహిళలు బయటకు వచ్చే వరకు ప్రభుత్వం స్పందించలేదని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను తిడితేనే అరెస్టులు చేస్తారా?.. రాజధాని మహిళలను కించపరిచేలా మాట్లాడిన వారిని అరెస్టు చేయరా? అని సుంకర పద్మశ్రీ ప్రశ్నించారు. ఈరోజు విజయవాడలో కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ మీడియాతో మాట్లాడారు.

మాగంటి మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది:
జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతి పట్ల ఏపీ మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. మాగంటి అకాల మరణం బాధాకరమన్నారు. తెలుగుదేశం పార్టీతోనే మాగంటి గోపీనాథ్ గారి రాజకీయ ప్రస్థానం మొదలైందని గుర్తు చేశారు. మాగంటి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. మాగంటి కుటుంబ సభ్యులకు నారా లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాగంటి గోపీనాథ్‌ ఈరోజు కన్నుమూశారు. ఈనెల 5న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుదిశ్వాస విడిచారు.

15కు చేరిన తెలంగాణ మంత్రి వర్గం:
నేడు తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరిగింది. గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌ తెలంగాణ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులుగా గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో తెలంగాణ మంత్రి వర్గం 15కు చేరింది. మంత్రి వర్గంలో మరో మూడు ఖాళీలు ఉన్నాయి. సామాజిక వర్గాల కూర్పుతో తెలంగాణ మంత్రి వర్గం రెడ్డి 4, ఎస్సీలు 4, బీసీలు 3, వెలమ 1, బ్రాహ్మణ 1, కమ్మ 1, ఎస్టీ 1 నుంచి మంత్రులుగా ఉన్నారు. ఉమ్మడి హైదరాబాద్‌, రంగారెడ్డి. నిజామాబాద్‌ జిల్లాలకు దక్కని ప్రాతినిధ్యం. మైనార్టీలకు మంత్రి వర్గంలో ఛాన్స్‌ దక్కలేదు. త్వరలోనే మరోసారి మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని సమాచారం. పదిమందికిపైగా ఆశావాహులు మంత్రి పదవి దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు. మంత్రి పదవి దక్కకపోవడంతో పలువురు నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, మాల్‌ రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్‌సాగర్‌ రావు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బుజ్జగింపులకు రంగంలోకి దిగారు మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం:
తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ జాప్యానికి తెరపడింది. ఎట్టకేలకు కాంగ్రెస్ నాయకత్వం ముగ్గురిని కొత్త మంత్రులుగా ఎంపిక చేసింది. నేడు తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరిగింది. గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌ తెలంగాణ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులుగా గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ వారితో ప్రమాణం చేయించారు. కొత్త మంత్రులను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. మంత్రుల ప్రమాణ స్వీకారం వేళ కొత్త మంత్రులకు ఏ శాఖలు అప్పగిస్తారు అనే చర్చ ఊపందుకుంది. నేటి సాయంత్రానికి మంత్రులకు శాఖల కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఎం రేవంత్ దగ్గర ఉన్న శాఖల నుంచే కొత్త మంత్రులకు కేటాయింపు చేస్తారని టాక్. సీఎం రేవంత్ దగ్గర కీలక శాఖలు హోం శాఖ, మున్సిపల్ శాఖ.. విద్యాశాఖ.. సంక్షేమ శాఖలు ఉన్నాయి.

బోరున విలపించిన కేసీఆర్:
జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు ఉదయం కన్నుమూశారు. మాగంటి మృతితో బీఆర్ఎస్ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మాగంటి గోపీనాథ్ మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. మాగంటి మరణం పార్టీకి తీరనిలోటు అని అన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. గోపీనాథ్‌ భౌతికకాయాన్ని మాదపూర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అక్కడికి చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు. కేసీఆర్ మాగంటి గోపీనాథ్ నివాసానికి చేరుకున్నారు. మాగంటి గోపీనాథ్ పార్దీవ దేహానికి పుష్పాంజలి ఘటించి బోరున విలపించారు. మాగంటి భౌతికకాయాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.

దేవేంద్ర ఫడ్నవీస్ కౌంటర్‌ ఎటాక్:
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)లోని శరద్ పవార్ వర్గం, శివసేన (యూబీటీ) ఉద్ధవ్ వర్గాల కూటమి ఊహించని ఓటమిని చవి చూసిందని పేర్కొన్నారు. అలాగే, కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించారు, అందుకే వారు ఇప్పుడు ఈవీఎంలను తప్పుబడుతూ, ప్రజాస్వామ్య ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆయన ఆరోపించారు. మహారాష్ట్రలో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ ఈవీఎంలపై ప్రశ్నలు లేవనెత్తడం ప్రతిపక్ష పార్టీలకు అలవాటుగా మారిపోయిందని చెప్పుకొచ్చారు. రాహుల్‌ గాంధీ వైఫల్యాన్ని అంగీకరించలేని వ్యక్తి అని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు.

ఆనందంలో రాజస్థాన్ కాంగ్రెస్:
రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలంటే మొదట మాజీ సీఎం అశోక్‌ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ మధ్య విభేదాలే గుర్తుకు వస్తాయి. ఈ క్రమంలో శనివారం వీరిద్దరూ సమావేశం అయ్యారు. గెహ్లాట్ నివాసంలో జరిగిన ఈ భేటీ చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ అంశంపై ఇద్దరు నేతలు ఎక్స్‌ (ట్విట్టర్)లో పోస్టులు పెట్టారు. తన తండ్రి, మాజీ కేంద్రమంత్రి రాజేశ్‌ పైలట్‌ 25వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆహ్వానించడానికి మాజీ సీఎంను కలిశాను అని సచిన్ తెలపగా.. ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను అశోక్ గెహ్లాట్ షేర్ చేశారు. రాజేశ్‌ పైలట్‌తో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

అల్లాహ్ పేరుతో ఆత్మహుతి:
ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ఒక సంచలనాత్మక సంఘటన వెలుగులోకి వచ్చింది. బక్రీద్ సందర్భంగా ఇస్ముహమ్మద్ అన్సారీ మేకలను వధించడానికి ఉపయోగించే భుజలి అనే ఆయుధంతో తన మెడను కోసుకుని ఆత్మాహుతి చేసుకున్నాడు. ఈ సంఘటనతో ఆ ప్రాంత ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు సంఘటనా స్థలం నుంచి ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఇస్ముహమ్మద్ సంచలన విషయాలు రాసుకొచ్చారు. నేను అల్లాహ్ దూత పేరు మీద నన్ను నేను బలి ఇస్తున్నానని పేర్కొన్నాడు. తనను ఎవరూ హత్య చేయలేదని రాశాడు. ఆ సూసైడ్ నోట్ లో ఇలా రాసి ఉంది. “ఒక మనిషి తన సొంత బిడ్డలాగా మేకను పెంచి, దానిని బలి ఇస్తాడు. అది కూడా జీవమే. మనల్ని మనం త్యాగం చేసుకోవాలి. అల్లాహ్ దూత పేరిట నన్ను నేను అర్పించుకుంటున్నాను.” అని పేర్కొన్నాడు. తన సమాధిని ఎలా రూపొందించాలో కూడా నోట్ ద్వారా వివరించాడు.

పాక్‌కు ఉగ్రవాద నిరోధక కమిటీ వైస్‌ ఛైర్మన్‌ హోదా:
ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన పాకిస్థాన్‌కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో టెర్రర్ నిరోధక కమిటీకి వైస్‌ ఛైర్మన్‌ హోదాను కట్టబెట్టడం ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఇస్లామాబాద్‌కు తాలిబాన్ల ఆంక్షల కమిటీ బాధ్యతలను అప్పగించడంపై ప్రపంచ దేశాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇక, భద్రతా మండలి తీసుకున్న ఈ నిర్ణయాన్ని కౌన్సిల్‌లోని మిగిలిన సభ్యులు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. జనవరిలో జరగాల్సిన ఐక్యరాజ్య సమితి కమిటీల కేటాయింపు ప్రక్రియ కేవలం పాకిస్తాన్ డిమాండ్లపై ఏకాభిప్రాయం లేకపోవడంతోనే గత ఐదు నెలలు ఆలస్యమైందని అధికారులు తెలిపారు.

లాస్ ఏంజిల్స్లో హైటెన్షన్:
అమెరికాలోని అక్రమ వలసదారుల ఏరివేత నేపథ్యంలో ఫెడరల్‌ అధికారులు లాస్‌ ఏంజిల్స్ లో చేపట్టిన ఆకస్మిక తనిఖీలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో తాజాగా యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆందోళనకారులను తీవ్రంగా హెచ్చరించారు. ట్రూత్‌ సోషల్‌ వేదికగా ట్రంప్ ఒక పోస్టు పెట్టారు.. అందులో కాలిఫోర్నియా గవర్నర్‌ గావిన్‌ న్యూసమ్‌, లాస్‌ ఏంజెలెస్‌ మేయర్‌ కరెన్‌ బాస్‌ తమ బాధ్యతలను నిర్వర్తించలేరనే.. విషయం అందరికీ తెలుసు అని రాసుకొచ్చారు. ఇక, ఫెడరల్‌ ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తుంది అని తేల్చి చెప్పారు. నిరసనకారులు, దోపిడీదారుల సమస్య వలే పరిష్కరిస్తామని ట్రంప్ వెల్లడించారు.

తొక్కిసలాట ఘటనలో సంచలన విషయాలు:
బెంగళూరు తొక్కిసలాట ఘటనలో 11 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ అంశంపై సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తాజాగా విధానసౌధ భద్రతా విభాగం డీసీపీ ఎం.ఎన్. కరిబసవనగౌడ రాసిన లేఖ బయటపడింది. అందులో కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినట్లు తేలిసంది. జూన్ 4న, డీసీపీ కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాశారు. “ఆర్సీబీకి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. లక్షలాది మంది వేడుకకు రావొచ్చు. భద్రతా సిబ్బంది కొరత ఉంది. అభిమానుల భారీగా తరలి వస్తే అనుకోని ఘటనలు జరగవచ్చు. ప్రజా ప్రవేశ పాస్‌లను రద్దు చేయాలి. విధానసౌధ ప్రాంగణంలో సీసీటీవీ నిఘా అసంపూర్ణంగా ఉంది. దీనివల్ల భద్రతా సమస్యలు తలెత్తవచ్చు.” అని ముందుగానే పరిపాలనా సంస్కరణల శాఖ కార్యదర్శి జి. సత్యవతికి రాసిన లేఖలో హెచ్చరంచారు.

ఎంపీ ప్రియ సరోజ్ తో రింకూ సింగ్ ఎంగేజ్మెంట్:
భారత క్రికెటర్ రింకూ సింగ్ వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ను రింకూ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ క్రమంలో వీరిద్దని నిశ్చితార్థం ఈరోజు (జూన్ 8న) జ‌ర‌గ‌నుంది. వీరి ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం లక్నోలోని ఓ ఫైవ్ స్టార్ హాటల్‌లో జరగనుంది. అలాగే, రింకూ సింగ్, ప్రియా సరోజ్ నవంబర్‌లో పెళ్లి చేసుకోనున్నారు. వారి పెళ్లి వారణాసిలో నవంబర్ 18వ తేదీన హోటల్ తాజ్‌లో గ్రాండ్‌గా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఆకట్టుకుంటున్న సప్తమి గౌడ లుక్:
టాలీవుడ్​లో కొంతకాలంగా సరైన హిట్ కోసం తాపత్రయ పడుతున్న హీరోల్లో నితిన్ ఒకరు. చివరగా ‘రాబిన్ హుడ్’ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ .. అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రజెంట్ ఇప్పుడు ‘తమ్ముడు’ సినిమాలో నటిస్తున్నాడు నితిన్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో లయ, స్వశిక, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‌దేవా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో కాంతార న‌టి స‌ప్త‌మి గౌడ క‌థానాయిక‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. నేడు స‌ప్త‌మి బ‌ర్త్‌డే కావ‌డంతో ఆమెకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ కొత్త పోస్ట‌ర్‌ను పంచుకున్నారు. ఈ లుక్‌లో సప్తమి లంగ జాకెట్ ధరించి .. పల్లెటూరి అమ్మాయిల అమాయకంగా కనిపించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉంటుందట. అందుకే ఆ రోల్ కి సప్తమి అయితే న్యాయం చేయగలరని దర్శకుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మాస్ దేవుడు తిరిగొచ్చాడు:
నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని మళ్లీ కలిసి పని చేయబోతున్నారు. ‘వీర సింహా రెడ్డి’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కబోతోంది. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానే వచ్చింది. తాజాగా ఈ సినిమా గురించి గోపీచంద్ మలినేని పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు.. ‘నందమూరి బాలకృష్ణ గారితో తిరిగి కలవడం గౌరవంగా ఉంది. మహాదేవుడు తిరిగి వచ్చాడు… ఈసారి మనం బిగ్గరగా గర్జిస్తున్నాం’ అంటూ తెలిపారు. ప్రజంట్ పోస్ట్ వైరల్ అవుతుంది. గోపీచంద్ మాలినేని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆల్ మోస్ట్ మూవీ గురించి చాలా విషయాలే పంచుకున్నారు.. ‘బాలకృష్ణ తో స్క్రిప్ట్ డిస్కషన్ అయిపోయింది.. ఏ బ్యానర్ లో చేస్తారనేది ఆయన డిసైడ్ చేస్తారు. డెఫినెట్ గా ఇదొక సాలిడ్ స్క్రిప్ట్. వంద శాతం ఒక కొత్త డైమెన్షన్ లో ఉంటుంది. మీరు ఊహించిన దానికి మించి ఉంటుంది. మీ ఇమేజినేషన్ కి అందదు’ అని తెలిపారు. అలాగే ‘వీర సింహా రెడ్డి’ సినిమాలో రెండు పాత్రలను బ్యాలెన్స్ చేయలేకపోయారని కామెంట్స్ వచ్చాయి.. ఈసారి అలాంటి కంప్లెయింట్ రాకూడదనే విధంగా వర్క్ చేస్తున్నామని గోపీచంద్ అన్నారు. అంటే ఈ చిత్రంలోనూ ద్విపాత్రాభినయం ఉంటుందని దర్శకుడు హింట్ ఇచ్చారు. ఏదైనా కథను బట్టి ఉంటుందన్నారు. ఆయన కామెంట్స్ తో మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

 

 

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.