
Devendra Fadnavis: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం తీవ్ర విమర్శలు చేశారు. ‘‘రాహుల్ గాంధీని ప్రజలు తిరస్కరించినప్పటికి నుంచి ఆయన ప్రజాస్వామ్య ప్రక్రియను పదే పదే అవమానిస్తున్నారు’’ అని ఆరోపించారు. ‘‘రాహుల్ గాంధీ నిరంతరం ప్రజాస్వామ్య ప్రక్రియను అవమానిస్తున్నారు. ఆయన ప్రజాతీర్పును పదే పదే అగౌరపరుస్తున్నారు. ప్రజలు రాహుల్ గాంధీని తిరస్కరించారు. ప్రతీకారంగా ఆయన ప్రజల్ని తిరస్కరిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీని మరింత క్షీణతలోకి నెట్టివేస్తుంది’’ అని ఫడ్నవీస్ అన్నారు.
దీనికి ముందు, శనివారం రోజు రాహుల్ గాంధీ ఒక వార్తా పత్రిక కథనంలో.. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ‘‘ప్రజాస్వామ్యాన్ని మోసగించడానికి ఒక ప్రణాళిక’’ అని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ‘‘మ్యాక్ ఫిక్సింగ్’’ జరిగినట్లు బీహార్ లో కూడా చేస్తారని ఆయన ఆరోపించారు. అయితే, రాహుల్ గాంధీ వాదనల్ని ‘పూర్తిగా అసంబద్ధం’’ అని కేంద్రం ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.
Read Also: Covid-19 Cases: దేశంలో 6000 మార్కును దాటిన కరోనా కేసులు..
దీనికి కౌంటర్గా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం వార్తా కథనంలో రాహుల్ గాంధీ తీరును ప్రశ్నించారు. ‘‘ప్రజాస్వామ్య ప్రక్రియ, రాజ్యాంగ సంస్థలపై నిరంతరం సందేహాలు వ్యక్తం చేయడం ద్వారా, దేశాన్ని ఎటు వైపు తీసుకెళ్తున్నారు..? ఎలాంటి విషాన్ని వ్యాపింపచేస్తున్నారు..?’’ అని అడిగారు. ‘‘మహారాష్ట్రలో ఓటమి ఎంత తీవ్రంగా బాధించిందో నాకు అర్థమైంది. కానీ మీరు రైతులు, మహిళలు, పౌరులు,మహారాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని ఇలా అవమానించడం కొనసాగిస్తే, రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరు. ముఖ్యమంత్రిగా, ప్రజా సేవకుడిగా, మహారాష్ట్ర ప్రజలకు జరిగిన ఇటువంటి అవమానాన్ని నేను ఎల్లప్పుడూ ఖండిస్తాను” అని ఫడ్నవిస్ అన్నారు.
గతేడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 288 సీట్లకు గానూ 235 సీట్లను గెలుకుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లోని కాంగ్రెస్-16, శివసేన (ఠాక్రే)-20, శరద్ పవార్ ఎన్సీపీ-10 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఆరు దశాబ్ధాలలో తొలిసారిగా ప్రతిపక్ష నాయకుడి హోదా పొందలేకపోయారు.