
ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు దేశ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. మహారాష్ట్రలో రిగ్గింగ్ చేశారని.. త్వరలో బీహార్ కూడా అదే జరగబోతోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై ఇప్పటికే ఎన్డీఏ నేతలు ప్రతి విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఎన్నికల్లో గెలవలేక రాహుల్ ఇలాంటి ఆరోపణలకు దిగుతున్నారని బీజేపీ నేతలు విమర్శించారు.
రాహుల్ గాంధీ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఆరోపణలు కాదు.. నేరుగా ఫిర్యాదు చేయాలని.. లేదంటే తమకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే అప్పుడు స్పందిస్తామని ఈసీ తెలిపింది.
ఎన్నికల నిర్వహణ, అభిప్రాయాలపై ఆరు విపక్ష పార్టీలను వేర్వేరుగా ఆహ్వానిస్తే.. కాంగ్రెస్ పార్టీ గైర్హాజరైనట్లు ఈసీ తెలిపింది. మే 15న జరిగిన సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ హాజరు కాలేకపోయిందని తెలిపింది.
2024 మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చినప్పటికీ ఎన్నికల సంఘం పట్టించుకోలేదని రాహుల్ తన ఆర్టికల్ లో పేర్కొన్నారు. ఆరోపణలను, విమర్శలను కొట్టి పారేస్తే ఎన్నికల సంఘం క్రెడిబులిటీ నిలబడదని.. ప్రపంచానికి నిజాన్ని చెప్పినప్పుడే ఉంటుందని ఈసీని టార్గెట్ చేశారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, బీహార్ లో కూడా అదే రిపీట్ అవుతుందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఎక్కడైతే బీజేపీ ఓడిపోయే పరిస్థితి ఉంటుందో అక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందని తీవ్రంగా ఆరోపించారు.
మహారాష్ట్ర పోలింగ్ సీసీటీవీ ఫూటేజ్ ను ఈసీ బయటపెట్టాలని డిమాండ్ చేయడంపై స్పందించిన ఈసీ.. సీసీ ఫుటేజ్ ను ఎప్పుడైనా హైకోర్టు పరిశీలించవచ్చునని తెలిపారు. ఓటర్ల ప్రైవసీ, ఎన్నికల సమగ్రతను కాపాడేందుకు ఈసీ కృషి చేస్తోందని.. కానీ రాహుల్ గాంధీ ఓటర్ల విశ్వాన్ని దెబ్బతీసేలా అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఈసీ వర్గాలు విమర్శిస్తున్నాయి. రాహుల్ గాంధీ హైకోర్టును ఆశ్రయించవచ్చునని, ఈసీని నమ్మకపోయినా హైకోర్టును నమ్మవచ్చునని సూచించారు.