
అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని మూడు రోజుల పాటు అధికారులు విచారించారు. మొదటి రోజు మైనింగ్ కేసుకు సంబంధించి 22 ప్రశ్నలను పోలీసులు సంధించారు. వాటికి సరైన సమాధానం చెప్పలేదట. ఒకటి, రెండు ప్రశ్నలకు మాత్రమే ఆయన సమాధానం చెప్పారు. మిగిలిన ప్రశ్నలకు తనకు సంబంధం లేదని.. ఇవన్నీ తప్పుడు కేసులంటూ విచారణ అధికారికి బదులిచ్చారు. అయితే రెండో రోజు పోలీసులు మరిన్ని ప్రశ్నలను సిద్ధం చేసి కాకాణిని ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేశారు. అప్పట్లో వినియోగించిన వాహనాలు నెంబర్లు.. A1, A2, A3తో సంబంధాల గురించి ఎక్కువ ప్రశ్నలు అడిగారట. వారి బ్యాంక్ అకౌంట్ వివరాలు, బ్యాంక్ స్టేట్మెట్లు కూడా చూపించి.. ప్రశ్నలు అడిగారు. భారీగా మైనింగ్ చేసిన సీసీ పుటేజీని. అప్పట్లో పత్రికల్లో వచ్చిన వార్తలను కూడా చూపించారు. చెన్నైలో మైనింగ్ ఎగుమతి చేసిన వారి వివరాలు కూడా పోలీసులు పక్కగా తయారు చేసి చూపించారు. దీంతో కొన్ని ప్రశ్నలకు ఆయన మౌనమే సమాధానం. అవగాహన లేదు, గుర్తులేదు, మర్చిపోయా.. అంటూ కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. తనకు, కేసుకు సంబంధం లేదనీ.. కావాలనే తనను ఇరికించారనీ చెప్పే ప్రయత్నం చేశారాయన. SC, ST సెక్షన్ల కింద తప్పుడు కేసు పెట్టడం వల్లే నోటీసులకు స్పందించలేదన్నారాయన.
అక్రమ మైనింగ్ కేసులో 12 మందిపై కేసులు
పొదలకూరు మండలం రుస్తుం మైన్స్లో అక్రమ మైనింగ్ జరిగిందని నిర్ధారించిన పోలీసులు 12 మందిపై కేసులు నమోదు చేశారు. కాకాణి గోవర్థన్రెడ్డి.. ఏ4గా ఉన్నారు. ఈ కేసులో విచారించేందుకు పొదలకూరు పోలీసులు మూడుసార్లు నోటీసులు ఇచ్చినా కాకాణి స్పందించలేదు. ఇదే సమయంలో ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడంతో బెయిల్ రాదని గ్రహించిన కాకాణి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎట్టకేలకు మే 25న బెంగళూరులో అరెస్ట్ చేసి.. 26న న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టగా 14రోజులు రిమాండ్ పడింది. ఈ నెల 9తో రిమాండ్ గడువు ముగియనుంది.
అనుకున్న స్థాయిలో సమాచారం రాబట్టారా?
కేసు విచారణ దశలో ఉండటంతో కాకాణిని మరింతగా విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయన్న ఆలోచనతో అధికారులు విచారించారు. కోర్ట్ ఆదేశాల మేరకు కస్టడీలోకి తీసుకుని మూడు రోజుల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. మరి అనుకున్న స్థాయిలో సమాచారం రాబట్టారా? ఈ కేసులో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయనేది.. వెయిట్ అండ్ సీ.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..