. 2 minutes

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లయినా విద్యుత్, నీరు, రోడ్లు, వైద్యం వంటి కనీస ప్రాథమిక సౌక ర్యాలు లేని పల్లెలు చాలా ఉన్నాయి. ఈ కోవలోకి వస్తుంది. ములుగు జిల్లా, కన్నాయిగూడెం మండలం, సర్వాయి పంచాయతీ, భూపతిపూర్ గ్రామం. చత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి 25 కుటుంబాలకు చెందిన సుమారు వందమందికి పైగా ఇక్కడ జనాభా ఉంటారు. వలస వచ్చి ఇక్కడ స్థిరపడి 9 ఏళ్లు గడుస్తున్నా ఈ గ్రామంలో ఇప్పటికీ కరెంట్ సౌకర్యం లేదు. తాగునీటి సదుపాయం లేనే లేదు. నాగులమ్మ గుడి కోసం వేసిన బోర్ పంపు ఒక్కటే ఆ గ్రామస్థులందరికీ జీవనాధారగా మారింది. అందుకని నాగులమ్మ పేరు మీదగా నాగపూర్ అని పిలుచుకుంటున్నారు ఉంటున్న గొత్తికోయలు. ఒక్క నెలలో రెండు, మూడుసార్లు చేతి పంపు రిపేర్‌కు వస్తుందని, ఆ పంపు నీళ్ళు చిలుము వాసన రావడంతో వాగు దగ్గర వెళ్ళి చెలిమ తీసుకొని నీళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. భూపతిపూర్ గ్రామం దగ్గర ఒక గూడెం ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంతమంది సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు, ఆధార్, ఉపాధి హామీ జాబ్ కార్డ్ మొదలైనవి పొందుతున్నారు.

అయితే, వలస వచ్చి ఏండ్లు గడుస్తున్నా తమ జీవన విధానంలో మార్పు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదని వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. విప్ప కాయలు దంచి, ఎండబెట్టి వాటిని మెషీన్లో పట్టించి వచ్చిన నూనెను వంటనూనెను దీపాలుగా వాడుతున్నారు. ఈ గూడేనికి వచ్చిన అధికారులకు ఎన్నిసార్లు తమ దీర్ఘకాలిక సమస్యలు, ఇబ్బందులు మొరపెట్టుకున్నప్పటికీ అన్ని సదుపాయాలు వస్తాయి.. చేస్తాము.. అని చెప్పడమే ఆచరణలో ఏమాత్రం ఫలితాలు కానరావడం లేదని వాపోతున్నారు. గతంలో సిఆర్‌పిఎఫ్ జవాన్లు తమ గూడేనికి వచ్చి నీటి కోసం తాము పడుతున్న అగచాట్లను స్వయంగా తెలుసుకొని సింథటిక్ ట్యాంకులు పెట్టారని, కానీ వాటికి నీళ్లు వచ్చే విధంగా పైపులైన్ లేదని అన్నారు. దీంతో సిఆర్‌పిఎఫ్ జవాన్లు ఏడాది కిందట అందజేసిన సింథటిక్ ట్యాంక్స్ వృధాగా పడి ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు. కొందరికి సిఆర్‌పిఎఫ్ జవాన్లు సోలార్లు దీపాలు అందజేశారు. కరెంటు కోసమని సోలార్ విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు కానీ వెలగడం లేదని తెలిపారు. తమలో కొంతమంది చత్తీస్‌గఢ్ నుంచి సోలార్ దీపాలు తెచ్చుకొని రాత్రిపూట వెలుతురు కోసం తిప్పలు పడుతున్నామని వాపోయారు.

ముఖ్యంగా బ్యాటరీ సోలార్ టార్చ్‌లైట్లు ఉపయోగించి రాత్రి వేళలో పాముల నుంచి ఇతర జంతువుల నుంచి కాపాడుకోవడానికి కాలం గడుపుతున్నామని అన్నారు. నిత్య అవసరమైన కరెంటు సదుపాయం లేక బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా జీవనం కొనసాగించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి పంచాయతీ కార్యదర్శులు, ఇతర ఎవరైనా అధికారులు వస్తే తప్ప తమకేమీ తెలియవని చెప్తున్నారు. గొత్తికోయలు కోళ్ల పెంపకంలో భాగంగా ప్రత్యేకమైన గూళ్లను గుడిసెకు కింది భాగంలో ఒక కర్రను పైకి పెట్టి దానికి ఒక బుట్ట కట్టి దాంట్లో కోళ్లు ఉండేలాగా ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. ఇంట్లో కాకుండా గుడిసె చూరు భాగంలో కోళ్లను పెంచుకుంటామని పలువురు తెలిపారు.

మునయ్య, గుత్తి కోయవాసి: కరెంటు లేని మా గూడేనికి వచ్చి ,మా బతుకులను చూసి మా పిల్లలకు ఉపయోగపడేలా విద్యుత్, నీటి సదుపాయంతోపాటు పిల్లలకు విద్యను అందించే విధంగా పాఠశాల ఏర్పాటు చేయాలి. మేము చీకట్లో బతుకుతున్నా. మా పిల్లలకు అయినా కరెంటును చూసే విధంగా ఏర్పాటు చేసి మా బతుకులకు వెలుగునివ్వాలి.
పంచాయతీ కార్యదర్శి: గొత్తికోయల గ్రామానికి కరెంటు సదుపాయం  ఉంటే బాగుంటుంది. నీటి సదుపాయం కూడా అరకొరగానే ఉంది. నీటిని అందించాలంటే పంచాయతీ ట్రాక్టర్‌తో సింథటిక్ ట్యాంక్‌లో నింపాలి.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.