
Job Notification: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ పురపాలిత ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత మెరుగుపరచే దిశగా కీలక చర్యలు చేపట్టింది. అర్బన్ క్లినిక్స్ ఏర్పాటు కోసం గతంలో విడుదలైన ఉత్తర్వుల్లో కొన్ని మార్పులు చేస్తూ, నూతనంగా G.O.Rt.No.357 ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వు ద్వారా ప్రాథమిక ఆరోగ్య సదుపాయాల విస్తరణను లక్ష్యంగా పెట్టుకొని భారీగా పోస్టులు భర్తీ చేయడానికి ఆమోదం తెలిపింది. వీటిలో కొన్ని కాంట్రాక్ట్ విధానంలో, మరికొన్ని ఔట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
Read Also: Padmanabhaswamy Temple: 270 ఏళ్ల తర్వాత పద్మనాభస్వామి ఆలయంలో ‘‘మహా కుంభాభిషేకమ్’’..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ప్రకారం.. అర్బన్ క్లినిక్స్ లోని మానవ వనరుల నియామకానికి సంబంధించి వివిధ పోస్టులు భర్తీ కానున్నాయి. మొత్తం 560 మెడికల్ ఆఫీసర్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించనున్నారు. వీరికి నెలవారీ జీతంగా రూ. 61,960/- లభిస్తుంది. అదే విధంగా, 1120 స్టాఫ్ నర్సులు కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించబడి వారికి రూ. 22,500/- వేతనం చెల్లించనున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 560 ఉండగా, వీరికి నెలవారీగా రూ. 23,393/- జీతం ఇవ్వనున్నారు. అదే సంఖ్యలో ఉన్న ఫార్మసిస్ట్ పోస్టులకు రూ. 23,500/- వేతనం నిర్ణయించారు. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) లుగా 560 పోస్టులను ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయాలని నిర్ణయించగా, వారికి నెలకు రూ. 18,450/- జీతం లభిస్తుంది. చివరగా, సానిటరీ అటెండెంట్ / లోవర్ గ్రేడ్ సర్వీసెస్ (LGS) లను కూడా 560 ఔట్సోర్సింగ్ పోస్టులు మంజూరయ్యాయి. వీరికి నెలవారీ జీతంగా రూ.15,000/- చెల్లించనున్నారు.
Read Also: Suhas Shetty Murder Case: ఎన్ఐఏ చేతికి సుహాస్ శెట్టి హత్య కేసు..
ఈ పోస్టుల భర్తీతో పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు సమర్థవంతంగా అందుబాటులోకి వస్తాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్య సదుపాయాలు లేని చోట్ల ఈ క్లినిక్స్ ద్వారా నిరంతర వైద్య సహాయం లభించే అవకాశం ఉంది. ఆరోగ్య శాఖ కమిషనర్ అండ్ నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ ఉత్తర్వు ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.