ఈశాన్య ఢిల్లీలోని దయాల్పూర్ ప్రాంతంలోని ఓ సూట్ కేసులో తొమ్మిదేళ్ల బాలిక మృత దేహం లభ్యమైంది. ఆమెపై అత్యాచారం చేసి, చంపేసి ఉంటారన్న ఆరోపణలను ఆమె కుటుంబ సభ్యులు చేశారు. దీనిపై స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. స్థానికులు కూడా ఆ మైనర్ బాలికపై అత్యాచారం, హత్యకు పాల్పడి ఉంటారన్న ఆరోపణలు చేశారు. శనివారం సాయంత్రం ఆ బాలిక మృతదేహం లభ్యమైంది. అక్కడ శాంతిభద్రతలను కాపాడడానికి పోలీసులు, పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు. ఈ దారుణ నేరానికి పాల్పడిన వ్యక్తి మృతదేహాన్ని సూట్కేస్లో కుక్కి పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. లైంగిక దాడి సహా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు.
‘మరణానికి కారణాన్ని నిర్ధారించడానికి మేము శవ పరీక్ష నివేదిక కోసం ఎదురు చూస్తున్నాము. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి బృందాలను ఏర్పాటు చేసాయి. ఈ విషయాన్ని మేము అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాము’ అని ఓ పోలీసు అధికారి అన్నారు. నెహ్రూ విహార్ నివాసి అయిన ఆ బాలిక శనివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో సమీపంలో నివసిస్తున్న బంధువుకు ఐస్ ఇవ్వడానికి వెళ్లిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. దయాల్పూర్ పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్ పోక్సో చట్టం సెక్షన్ 6 కింద కేసు నమోదుచేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఆ బాలిక తల్లి ఓదార్చలేని దుఃఖంలో మునిగిపోయింది.