. 2 minutes
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు.. ఏడుగురు కేంద్రమంత్రులతో కీలక చర్చలు..!

రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. శుక్ర, శనివారం హస్తినలో బిజీబిజీగా గడపుతారు. పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై చర్చించి సహకారం కోరనున్నారు. ఇవాళ, రేపు చంద్రబాబు షెడ్యూల్ ఏంటీ?. ఎన్ని గంటలకు ఏఏ మంత్రిని కలుస్తారు..? ఏఏ అంశాలపై చర్చిస్తారు? తెలుసుకుందాం.

ఏపీ అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై మంత్రులతో చర్చించి సహకారం కోరేందుకు ఢిల్లీకి చేరుకున్నారు సీఎం చంద్రబాబు. ఇవాళ ఉదయం 10గంటల నుంచి రాత్రి 9గంటల వరకూ కంటిన్యూగా ఏడుగురు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఢిఫెన్స్, స్పేస్ మానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ తయారీ పరిశ్రమలు, పోలవరం, బనకచర్లకు కేంద్ర సాయం, ప్రతి ఇంటికీ తాగునీరు, రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు తదితర అంశాలపై కేంద్ర మంత్రులతో ప్రధానంగా చర్చించనున్నారు సీఎం చంద్రబాబు. అంతేకాదు నూతన క్రిమినల్‌ చట్టాల అమలు తీరుతెన్నులపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నిర్వహించే సమీక్షకు చంద్రబాబు హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విధానపరమైన రోడ్ మ్యాప్ సమర్పించడానికి నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్‌లో పాల్గొననున్నారు సీఎం చంద్రబాబు.

శుక్రవారం ఉదయం 10గంటలకు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులలో సహకారం గురించి చర్చిస్తారు. అలాగే ఉదయం 11 గంటలకి సౌత్ బ్లాక్‌లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశం అవుతారు ముఖ్యమంత్రి చంద్రబాబు. BEL డిఫెన్స్ కాంప్లెక్స్ HAL-AMCA కార్యక్రమంతో సహా ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మక రక్షణ ఏరోస్పేస్ కార్యక్రమాలపై చర్చి్స్తారు. మధ్యాహ్నం 12గంటల నుంచి12 గంటల45 నిమిషాల వరకూ శ్రమ్ శక్తి భవన్‌లో జలశక్తిశాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌తో భేటీ అవుతారు. నీటి మౌలిక సదుపాయాలు పెండింగ్‌లో ఉన్న నీటిపారుదల ప్రతిపాదనలపై మాట్లాడుతారు ముఖ్యమంత్రి.

ఇక మధ్యాహ్నం ఒంటి గంటకు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌తో సమావేశం అవుతారు చంద్రబాబు. నూతన పరిశోధనలు, ఆవిష్కరణ, పారిశ్రామిక విజ్ఞాన సహకారాలపై కేంద్రమంత్రితో చర్చిస్తారు సీఎం. సాయంత్రం 3గంటలకు నార్త్‌బ్లాక్‌లో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం భేటీ అవుతారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించి.. మెరుగైన ఆర్థిక కేటాయింపులు చేయాలని.. రాష్ట్రాభివృద్ధికి మద్దతుగా నిలవాలని కోరనున్నారు చంద్రబాబు. ఇక సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై జరిగే కీలక సమీక్షా సమావేశానికి హాజరవుతారు సీఎం చంద్రబాబు.

తర్వాత రాత్రి 9గంటలకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలుసుకుంటారు సీఎం చంద్రబాబు. డిజిటల్ మౌలిక సదుపాయాలు, భవిష్యత్ సాంకేతిక ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ పాత్రపై చర్చిస్తారు. ఇక రేపు ఉదయం 9గంటలకు భారత్ మండపంలో జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌తో కలిసి హాజరవుతారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సంస్కరణా పరమైన పాలన నమూనాను వివరించి, కీలక అభివృద్ధి కార్యక్రమాలను హైలైట్ చేస్తారు. రాష్ట్రం సమగ్ర, స్థిరమైన వృద్ధిని సాధించడానికి కేంద్రం నుండి అందాల్సిన సహకారాన్ని కోరతారు ఏపీ సీఎం చంద్రబాబు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.