
Gulzar House Fire Incident: హైదరాబాద్ లోని గుల్జార్ హౌస్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం అందరినీ కలచివేసింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓ భవనంలో సంభవించిన ఈ ప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు అనేక దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. ప్రభుత్వం ఇప్పటికే హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇక ప్రమాదం జరిగిన వెంటనే క్లూస్, ఫోరెన్సిక్ టీంలు ఘటన స్థలానికి చేరుకుని ఇంటి లోపలికి వెళ్లి విచారణ చేపట్టాయి. భవనంలో ప్రమాదానికి గల అసలు కారణాన్ని నిర్ధారించే ప్రయత్నంలో అధికారులు కీలక వివరాలను కనుగొన్నారు.
Read Also: Tata Harrier EV: కిరాక్ లుక్లో జూన్ 3న లాంచ్కు సిద్దమైన టాటా హారియర్ EV..!
అధికారుల వివరాల ప్రకారం, గుల్జార్ హౌస్ భవనంలో మొత్తం 14 ఏసీలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో ఏదో ఏసీ యూనిట్లోని కంప్రెసర్ ఒక్కసారిగా పేలినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ పేలుడు తీవ్రమైన అగ్ని ప్రమాదానికి దారితీసిందని అధికారులు తెలిపారు. పేలుడు తీవ్రతకు భవనం మొత్తం తునా తునకలైనట్లు వెల్లడించారు. గ్రౌండ్ ప్లస్ టూ అంతస్తులతో నిర్మించిన భవనం మొత్తం ప్రమాదంతో తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. మూడంతస్తుల భవనంలోని వస్తువులు అన్నీ పనికి రాకుండా పోయాయి. గోడలన్నీ పగిలిపోయినట్లుగా, ఫ్లోర్లలో వేడి ప్రభావంతో బీటలు పడినట్లుగా గుర్తించారు. అలాగే టైల్స్, మార్బుల్స్ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయని నివేదికలు చెబుతున్నాయి.
Read Also: Monsoon: గుడ్న్యూస్.. 4 రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
ఈ ప్రమాదం నేపథ్యంలో భవన నిర్మాణ నాణ్యతపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంప్రెసర్ పేలుడు ఎంత తీవ్రమైనా, భవనం అంతటి స్థాయిలో ధ్వంసం కావడం వెనుక నిర్మాణంలో లోపాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. 17 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ విషాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. ఇప్పటికే హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి పూర్తి నివేదిక కోరింది.