
బాబా ఫసియుద్దీన్… బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్. ఇప్పుడీ పేరే తెలంగాణ రాజకీయాల్లో రచ్చ లేపుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం క్షీణించడానికి ఫసియుద్దీనే కారణమన్న వాదనలు పొలిటికల్ సర్కిల్లో హాట్హాట్గా వినిపిస్తున్నాయి. అసలు వీరిద్దరి మధ్య వివాదం ఏంటి..? ఒకప్పుడు కారు పార్టీలో పనిచేసిన ఫసియుద్దీన్కి మాగంటికి గొడవ ఎక్కడ మొదలైంది..? ఆ గొడవలకి మాగంటి కుంగిపోవడమేంటి..? ఇప్పుడివే అంశాలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
మొన్నటికి మొన్న బోరబండలో ఓ దారుణం జరిగింది. బీఆర్ఎస్కు చెందిన మైనారిటీ నేత సర్దార్ ఆత్మహత్య చేసుకున్నారు. కారణం… బాబా ఫసియుద్దీనే అంటూ ఆరోపించారు కుటుంబ సభ్యులు. ఆయన వేధింపులు తట్టుకోలేకే అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే చెబుతూ వస్తున్నారు. సర్దార్ ఇంటిని కూల్చేందుకు ఫసియుద్దీన్ ప్రయత్నించాడని.. అందుకే మనస్తాపానికి గురై సర్దార్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సర్దార్ మరణానికి మాగంటి గోపీనాథ్కి లింకేంటంటారా…! యస్… సర్దార్, మాగంటి గోపీనాథ్ అనుచరుడు. నిత్యం ఆయన వెంటనే ఉండేవారు. మాగంటి కుటుంబంలో ఓ సభ్యుడైపోయారు. అలాంటి సర్దార్ మరణం మాగంటిని కుంగదీసిందని చెబుతున్నారు కారుపార్టీ నేతలు. సర్దార్ను తలుచుకుంటూ కొన్ని రోజులపాటు మాగంటి భోజనం చేయలేదంటున్నారు.
అంతేకాదు… మాగంటికి, ఫసియుద్దీన్కి గతంలో ఉన్న వివాదాల కారణంగానే సర్దార్ని ఫసియుద్దీన్ టార్గెట్ చేసినట్లు బీఆర్ఎస్ చెబుతోంది. మాగంటిని మానసికంగా దెబ్బతీసేందుకు ఫసియుద్దీన్ సర్దార్ని వేధింపులకు గురిచేశాడంటున్నారు పలువురు నేతలు. ఫసియుద్దీన్ అరాచకాలు ప్రభుత్వానికి కనపడట్లేదా అని నిలదీస్తున్నారు. మొన్న సర్దార్ ఫ్యామిలీని పరామర్శించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సైతం ఇదే ప్రశ్నలులేవనెత్తారు.
మొత్తంగా… ఫసియుద్దీనే అంతా చేశారంటోంది గులాబీ పార్టీ. పగ, కుట్రలతో రగిలిపోతున్న వ్యక్తి వల్ల కారుపార్టీ నేతలు కుంగిపోతున్నారని ఆరోపిస్తోంది. ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే… తమ ప్రభుత్వం వచ్చాక రియాక్షన్ మరింత సాలిడ్గా ఉంటుందంటూ హెచ్చరిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..