
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట కేసులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఫ్రాంచైజీకి ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ కేసులో ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసాలే అరెస్ట్ అయ్యారు. విక్టరీ పరేడ్కు సంబంధించి నిఖిల్ అనధికారికంగా ప్రమోషన్స్ చేశారని, అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ముంబైకి వెళుతుండగా బెంగళూరు కెంపెగౌడ ఎయిర్పోర్ట్లో నిఖిల్ను కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిఖిల్తో పాటు DNA సిబ్బంది సునీల్ మాథ్యూ, కిరణ్, మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. కబ్బన్పార్క్ పోలీస్ స్టేషన్లో నలుగురిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
అటు ఆర్సీబీ విజయోత్సవ వేడుక నిర్వాహకులు, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ శంకర్, ట్రెజరర్ జైరామ్ పరారీలో ఉండగా.. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, RCB విజయోత్సవ పరేడ్లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆర్సీబీ ప్రమోషనల్ బ్రాండింగ్లో నిఖిల్ కీలక పాత్ర వ్యవహరిస్తున్నాడు. నివేదికల ప్రకారం.. 2008 నుంచి నిఖిల్ ఆర్సీబీతో ఉన్నాడు.
నిఖిల్ భార్య, అనుష్క శర్మ ఫ్రెండ్స్..
ఐపీఎల్ 2025లో ఆర్సీబీ ఆడిన ప్రతీ మ్యాచ్లోనూ అనుష్క శర్మతో పాటు కనిపించిన ఓ మహిళ మీకు గుర్తుందా.? ఆమె మరెవరో కాదు.. నిఖిల్ సొసాలే భార్య మాళవిక నాయక్. నిఖిల్లాగే.. ఆమె వ్యాపార అభివృద్ధిలో పాత్ర పోషించడమే కాకుండా.. వ్యాపార భాగస్వామిగా కీ రోల్లో ఉన్నారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, నిఖిల్, మాళవికల మధ్య సన్నిహిత సంబంధం ఉంది.
కర్ణాటక సీఎం కీలక నిర్ణయం..
బెంగళూరు తొక్కిసలాట కేసు విషయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీరియస్గా ఉన్నారు. దీనికి బాధ్యులైనవారు ఎవరైనా విడిచిపెట్టేది లేదని క్లారిటీ ఇచ్చారు. అందులో భాగంగానే ఆయన స్టేట్ పోలీస్ కమిషనర్ సహా పలువురు అధికారులను సస్పెండ్ చేశారు. అలాగే కర్ణాటక ఐపీఎస్ అధికారి సీమంత్ కుమార్ సింగ్ను బెంగళూరు కొత్త పోలీస్ కమిషనర్గా నియమించారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి