
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు ఎట్టకేలకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అధికారిక నివాసాన్ని కేటాయించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అనంతరం రేఖా గుప్తాకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించింది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తాను ముఖ్యమంత్రిగా అధిష్టానం ఎంపిక చేసింది. అయితే అంతకముందు కేజ్రీవాల్ నివాసం ఉన్న ఇంట్లోకి వెళ్లేందుకు రేఖా గుప్తా నిరాకరించారు. దీంతో షాలిమార్ బాగ్లో ఉన్న తన ఇంట్లో నుంచే రేఖా గుప్తా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఇన్నాళ్లకు ముఖ్యమంత్రికి అధికారిక నివాసం కేటాయించారు.
ఇది కూడా చదవండి: Gold Price Today: మూడు వేలు పెరిగిన వెండి.. నేడు తులం బంగారం ఎంతుందంటే?
ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్లోని ప్లాట్ నంబర్ 8, రాజ్ నివాస్ మార్గ్లో అధికారిక నివాసం కేటాయించబడింది. జూన్ 5న పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యుడీ) జారీ చేసిన లేఖ ప్రకారం ఈ నివాసం కేటాయించారు. దాదాపు నాలుగు నెలల తర్వాత రేఖ గుప్తాకు అధికారిక నివాసం కేటాయించారు.
ఇది కూడా చదవండి: AP Government: రైతు సమస్యలపై ఏపీ సర్కార్ ఫోకస్.. కీలక నిర్ణయం
ఈ ప్లాట్లోని నాలుగు బంగ్లాల్లో రేఖా గుప్తాకు 1, 2 నంబర్ల బంగ్లాలు కేటాయించారు. అదే సమయంలో 3, 4 నంబర్ల బంగ్లాలు వరుసగా డిప్యూటీ స్పీకర్ మోహన్ సింగ్ బిష్ట్, సాంఘిక సంక్షేమ మంత్రి రవీందర్ ఇంద్రజ్ సింగ్కు కేటాయించారు. ముఖ్యమంత్రికి జెడ్ కేటగిరి భద్రత కల్పించబడినందున నివాస వసతి కేటాయింపుపై హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను బంగ్లాలు పాటిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ కేటాయింపులపై ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ఇంకా స్పందించలేదు. ఈ బంగ్లాలను ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇష్టపడతారా? లేదంటే ఇంకేమైనా బంగ్లాలు పరిశీలిస్తారో తెలియాల్సి ఉంది.