
కాళేశ్వరం ప్రాజెక్ట్పై పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నేడు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కమిషన్ ముందు బహిరంగ విచారణకు హాజరయ్యారు. ఉదయం శామీర్పేట నివాసం నుంచి బీఆర్కే భవన్కు చేరుకున్న ఈటలను ఓపెన్ కోర్టులో కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. 20 నిమిషాల పాటు బహిరంగ విచారణలో అంతా నిజమే చెప్తానని ఈటల ప్రమాణం చేశారు. కమిషన్ ముందు 113వ సాక్షిగా ఈటల హాజరు కాగా.. బ్యారేజీ నిర్మాణం, కాళేశ్వరం కార్పొరేషన్, డీపీఆర్లపైనే కమిషన్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఆర్థిక మంత్రిగా ఎంతకాలం పనిచేశారు, మేడిగడ్డ-అన్నారం-సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం చేయాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారని ఈటలను కమిషన్ అడిగింది. టెక్నికల్ టీం రిపోర్టుల ఆధారంగా సబ్ కమిటీ నిర్ణయం మేరకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని, క్యాబినెట్ నిర్ణయం తర్వాతే మూడు బ్యారేజీల నిర్మాణం మొదలుపెట్టామని ఈటల బదులిచ్చారు. తుమ్మిది హేట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదని, అందుకే 150 నుంచి 148 కుదించామని చెప్పారు. రీ డిజైన్ చేయాలని ఎవరు ఆదేశించారని కమిషన్ చీఫ్ ప్రశ్నించగా.. మహారాష్ట్ర అభ్యంతరం చెప్పడంతో అప్పటి సీఎం కేసీఆర్ సబ్ కమిటీ వేశారని జవాబిచ్చారు. హరీష్ రావు చైర్మన్గా సబ్ కమిటీలో నేను, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నామని.. ఎక్స్పర్ట్ కమిటీ, టెక్నికల్ కమిటీ, సబ్ కమిటీ నిర్ణయం మేరకు రీ డిజైన్ జరిగిందని ఈటల చెప్పుకొచ్చారు.
Also Read: Kamal Haasan: రాజ్యసభకు కమల్ హాసన్ నామినేషన్.. హాజరైన సీఎం స్టాలిన్!
రీ డిజైన్ చేయడానికి సబ్ కమిటీ సంతకం చేసిందా? అని కమిషన్ అడగగా.. రీ డిజైన్ కోసం సబ్ కమిటీ సంతకం చేసిందని ఈటెల రాజేందర్ తెలిపారు. బ్యారేజీ నిర్మాణ ప్రదేశాలు ఎందుకు మార్చారు? అని ప్రశ్నిస్తే.. టెక్నికల్ డిటైల్స్ మీద తమకు అవగాహన ఉండదని, అంతా నిపుణులే చూసుకున్నారన్నారు. నిర్మాణ వ్యయం ఎంత అయ్యింది? అనే ప్రశ్నకు.. ముందుగా రూ.63 వేల కోట్లతో అనుకున్నామని, తర్వాత అది రూ.83 వేల కోట్లకు పెరిగిందని, ఇప్పుడు ఎంత అయ్యిందో తనకు తెలియదన్నారు. బ్యారేజీ నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందా? అని కమిషన్ అడిగితే.. ఫైన్సాన్స్ ఖాశాఖకు ఫుల్ డీటెయిల్స్ తెలియవని, ఇరిగేషన్ శాఖకే వివరాలు తెలిసి ఉంటుందని ఈటెల బదులిచ్చారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈటల ఆర్థిక మంత్రిగా పనిచేశారు.