
తమిళనాడులోని మధురై జిల్లా మేలూరు సమీపంలోని ఉదనపట్టీ గ్రామంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఏప్రిల్ నెలలో జరిగిన సాధారణ తవ్వకాల సందర్భంగా 800 ఏళ్ల నాటి శివాలయం బయటపడింది. ఈ ఆలయం, గత కొన్ని శతాబ్దాలుగా నేలమట్టంలో దాగివుంది.
ఈ చారిత్రక ఆలయం బయటపడిన విషయం తెలియడంతో.. దేవి ఆర్కియాలాజికల్ రిసెర్చ్ సెంటర్కు చెందిన పురావస్తు శాస్త్రవేత్త అరివుసెల్వం నేతృత్వంలోని శిల్ప విభాగం నిపుణులు సమగ్ర పరిశోధన చేపట్టారు. వారి అధ్యయనాల్లో ఈ ఆలయ చారిత్రక ప్రాముఖ్యత, ఆవిర్భావం గురించి ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
ఆలయంలోని శిల్పాలు, శాసనాలను పరిశీలించగా.. ఈ టెంపుల్ మారవర్మన్ సుందర పాండ్యన్-I పాలనా కాలం నాటిదని.. ముఖ్యంగా 1217-1218 AD మధ్యకాలం నాటిదని నిర్ధారణకు వచ్చారు. శాసనాల్లో ఈ ఆలయానికి ‘తెన్నవన్ ఈశ్వరమ్’ అని పేరు పెట్టినట్లు తేలింది. ఉదనపట్టీ గ్రామానికి ఆ కాలంలో ‘అత్తూరు’ అని పిలిచేవారని తేల్చారు.
పాండ్యుల రాజవంశపు ప్రత్యేక శైలి ఈ ఆలయ నిర్మాణంలో స్పష్టంగా కనిపిస్తుంది. విగ్రహాల అమరిక, శిల్పాలు, కట్టడపు నిర్మాణం ఆ కాలానికి చెందిన చారిత్రక విశిష్టతను ప్రతిబింబిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆలయంలో శివలింగంతో పాటు వినాయకుడు, దక్షిణామూర్తి, అమ్మవారికి సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి.
ఈ చారిత్రక ఆలయం గురించి తెలియడంతో.. స్థానికులు, భక్తులు భారీగా సందర్శనకు వస్తున్నాయి. ఆలయ నిర్మాణాన్ని చూసి భక్తులు ఆశ్చర్యంతో మునిగిపోతున్నారు. తమిళనాడు సంపదగా నిలిచిన ఆలయ వారసత్వానికి ఈ శివాలయం చక్కని ఉదాహారణ అని పురావస్తు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ ప్రాంతంలో ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి.

Ancient Temple
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..