
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం (జూన్ 4) నిర్వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయోత్సవాల సందర్భంగా మైదానం వెలుపల తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. పెద్దఎత్తున అభిమానులు స్టేడియం వద్దకు చేరుకోవడం, అదే సమయంలో వర్షం పడడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన యావత్ దేశంను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దుర్ఘటనపై ప్రతి ఒక్కరు సంతాపం వ్యక్తం చేశారు.
బెంగళూరు తొక్కిసలాట ఘటన మెల్లమెల్లగా ఆర్సీబీ మెడకు చుట్టుకుంటోంది. ఇప్పటికే ఆర్సీబీ, కర్ణాకట క్రికెట్ సంఘం, ఈవెంట్ మేనేజర్లపై కేసు నమోదయ్యాయి. ఆర్సీబీ టీమ్ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను, ఈవెంట్ నిర్వాహక సంస్థ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ముగ్గురు సిబ్బందిని శుక్రవారంఉదయం బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కూడా అరెస్ట్ చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తొక్కిసలాటకు భాద్యుడిగా కోహ్లీని వెంటనే అరెస్ట్ చేయాలని పోస్టులు పెడుతున్నారు. దాంతో ఇప్పుడు కోహ్లీ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ప్రస్తుతం ‘ArrestKohli’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
Also Read: CV Anand: బాధ్యత ఉండక్కర్లా.. ఏంటీ ఈ చిల్లర వేషాలు!
గతేడాది డిసెంబర్ 4న ‘పుష్ప 2’ సినిమా రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. వద్దని చెప్పినా వినకుండా థియేటర్కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చారని, తొక్కిసలాటకు బాద్యుడిగా బన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు. విరాట్ కోహ్లీని చూడటానికే లక్షలాది మంది చిన్నస్వామి స్టేడియానికి వచ్చారని, ఈ తొక్కిసలాటలో అతడిని బాద్యుడిగా చేస్తూ అరెస్ట్ చేయాలని నెటిజెన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి హైదరాబాద్ పోలీసులు బన్నీని అరెస్ట్ చేసినట్టు.. బెంగళూరు పోలీసులు కోహ్లీని అరెస్ట్ చేస్తారేమో చూడాలి.