
హైదరాబాద్, జూన్ 6: పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ పీజీ 2025) ప్రవేశ పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు శుక్రవారం (జూన్ 6) అనుమతి ఇచ్చింది. ఆగస్టు 3న పరీక్ష నిర్వహణకు అనుమతి కోరుతూ నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (NEB) దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన అత్యున్నత ధర్మాసనం ఈ మేరకు అనుమతి ఇచ్చింది. పరీక్షను ఆగస్టు 3 తిరిగి షెడ్యూల్ చేయడానికి సమయం కోరడం సముచితమేనని పీకే మిశ్రా, ఏజీ మసిస్లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. అనంతరం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా రెండు షిఫ్టులకు బదులు నీట్ పీజీ పరీక్షను ఒకే షిఫ్ట్లో ముగించాలని ఇటీవల సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. పరీక్ష నిర్వహణలో పూర్తి పారదర్శకతను పాటించాలని, సురక్షితమైన పరీక్షా కేంద్రాలనే ఎంచుకోవాలని ధర్మాసనం సూచించింది. రెండు షిఫ్టుల్లో రెండు ప్రశ్నపత్రాలు ఎప్పటికీ ఒకేవిధమైన స్థాయిని కలిగిఉండవని అభిప్రాయపడింది. పోటీ తీవ్రత ఒక్కమార్కు కూడా కీలకమేని పేర్కొంది. నార్మలైజేషన్ విధానాన్ని ప్రత్యేక కేసులకు మాత్రమే అనుసరించాలని, ప్రతి ఏడాదీ నిర్వహించుకొనే పరీక్షలకు అది సరికాదని ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో పరీక్షను ఒకే షిఫ్టులో నిర్వహించేందుకు NBE రెండు నెలల సమయం కోరగా.. మీకు రెండు నెలలు ఎందుకు అవసరం? అని ధర్మాసనం ప్రశ్నించింది. దాదాపు 2.5 లక్షల మంది అభ్యర్థులకు దేశ వ్యాప్తంగా మొత్తం 450 కేంద్రాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని NBE కోర్టుకు తెలియజేసింది. పరీక్ష ఒకే షిఫ్ట్లో జరగాల్సి ఉన్నందున కనీసం మరో 500 కేంద్రాలు అవసరం అవుతాయని పేర్కొంది. కేంద్రాలను గుర్తించడం, భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం, విద్యార్థులు పరీక్షా కేంద్రాలను ఎంచుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలిపింది.
అందుకు ఆగస్టు 3వరకు సమయం కావాలా? అంత సమయం ఎందుకు? అని కోర్టు ప్రశ్నించింది. మే 30న ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ మీరు ప్రక్రియ ప్రారంభించలేదని, దీని వల్ల అనవసర జాప్యం నెలకొంటుందని, అంతేకాకుండా విద్యార్ధుల అడ్మిషన్లు కూడా ఆలస్యం అవుతాయని జస్టిస్ మాసిహ్ వ్యాఖ్యానించారు. అయితే ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించడానికి ఎక్కువ సమయం అవసరమని కేంద్రం, NBE రెండూ వాదించాయి. నీట్ పీజీని ఒకే షిఫ్ట్లో నిర్వహించడానికి ఆగస్టు 3ను కాకుండా వీలైనంత త్వరగా నిర్వహించేందుకు మరో తేదీని తెలపాలని సాంకేతిక భాగస్వామి అయిన టీసీఎస్ను కోరినట్లు ఎన్బీఈ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అయితే చివరికి సుప్రీంకోర్టు వారి అభ్యర్థనను మన్నించి ఆగస్టు 3 ఒకే షిఫ్టులో పరీక్ష నిర్వహణకు అనుమతి ఇచ్చింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.