. 2 minutes
Bengaluru Stampede: ఎఫ్‌ఐఆర్ రద్దు చేయండి.. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన KSCA అధికారులు

Bengaluru Stampede: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన దురదృష్టకర తొక్కిసలాట ఘటనకు సంబంధించి తమపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) అధికారులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా ఈ ఘటన జరిగి, 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు.

ఘటన నేపథ్యం..

ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలుచుకున్న తర్వాత, జూన్ 4వ తేదీన చిన్నస్వామి స్టేడియం వద్ద విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు లక్షలాది మంది అభిమానులు తరలిరావడంతో, స్టేడియం బయట భారీగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు.

ఎఫ్‌ఐఆర్ నమోదు, అరెస్టులు..

ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కర్ణాటక పోలీసులు, RCB, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ DNA ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA)పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం ఈ ఘటనపై బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించి, సంబంధిత ప్రతినిధులను వెంటనే అరెస్టు చేయాలని డీజీపీ, ఐజీపీలను ఆదేశించారు. ఇప్పటికే RCB మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలే, DNA ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన సునీల్ మాథ్యూతో సహా నలుగురు అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

KSCA వాదన..

ఈ నేపథ్యంలో, KSCA అధ్యక్షుడు రఘురామ్ భట్, కార్యదర్శి ఎ. శంకర్, కోశాధికారి ఈ.ఎస్. జయరాంతో సహా పలువురు కార్యనిర్వాహక సభ్యులు కర్ణాటక హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తమపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని వారు కోరారు. పిటిషన్‌లో KSCA వాదనలు Uae Ilhlengzo..

  • వేదిక నిర్వహణే మా బాధ్యత: కర్ణాటకలో క్రికెట్ పాలక మండలి అయిన KSCA, ఐపీఎల్ ఈవెంట్‌లో పరిమిత పాత్ర పోషిస్తుందని పిటిషనర్లు పేర్కొన్నారు. టికెటింగ్, గేట్ నియంత్రణ, ఈవెంట్ నిర్వహణ వంటి బాధ్యతలు RCB ఫ్రాంచైజీ, DNA నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ చూసుకుంటాయని, తమ పాత్ర కేవలం అద్దె ఒప్పందం కింద స్టేడియాన్ని వేదికగా అందించడం మాత్రమే అని వారు వాదించారు. “మేం వేదికలను మాత్రమే చూస్తాం, ప్రేక్షకులను కాదు” అని KSCA తరపు న్యాయవాదులు వాదించినట్లు వార్తలు వచ్చాయి.
  • ముందస్తు సమాచారం, భద్రతా ఏర్పాట్ల అభ్యర్థన: ఈవెంట్‌కు ముందు జూన్ 3, 2025న సీనియర్ పోలీస్ అధికారులకు భద్రతా ఏర్పాట్లు కల్పించాలని KSCA అధికారికంగా అభ్యర్థించిందని పిటిషన్ వెల్లడించింది.
  • రాజకీయ ఒత్తిడి: ప్రభుత్వ నాయకులు, మంత్రులపై ఉన్న ప్రజా ఆగ్రహాన్ని మళ్లించడానికి ఎఫ్‌ఐఆర్‌లో తమ అధికారులను ఎంపిక చేసి చేర్చారని KSCA ఆరోపించింది. ప్రాథమిక విచారణ లేకుండా, రాజకీయ, ప్రజా ఒత్తిడితో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని వాదించారు.
  • అనుకోని సంఘటన: తొక్కిసలాట అనేది గుంపు ఒక్కసారిగా పెరగడం వల్ల జరిగిన ప్రమాదమని, తమపై ఉద్దేశపూర్వకత లేదా నిర్లక్ష్యం ఆపాదించలేమని పిటిషనర్లు పేర్కొన్నారు. గేట్ నిర్వహణ, గుంపు నియంత్రణ బాధ్యత ఈవెంట్ నిర్వాహకులు, పోలీసులదేనని వాదించారు.

కోర్టు విచారణ..

కర్ణాటక హైకోర్టు ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి ఇప్పటికే విచారణ చేపట్టింది. ఈ ఘటనపై విచారణకు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ మైఖేల్ డి’కున్హా నేతృత్వంలో ఒక ఏకసభ్య న్యాయ కమిషన్‌ను కూడా కర్ణాటక ప్రభుత్వం నియమించింది. ఈ కమిషన్ 30 రోజుల్లో నివేదికను సమర్పించనుంది.

KSCA అధికారులు తమ పిటిషన్‌పై మధ్యంతర ఉపశమనాన్ని కోరారు. దీని ద్వారా ఎఫ్‌ఐఆర్ , దాని నుంచి ఉత్పన్నమయ్యే అన్ని న్యాయపరమైన చర్యలను నిలిపివేయాలని అభ్యర్థించారు. ఈ కేసు శుక్రవారం (జూన్ 6, 2025) మధ్యాహ్నం జస్టిస్ ఎస్.ఆర్. కృష్ణ కుమార్ ముందు విచారణకు జాబితా చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తుండగా, KSCA ఈ కేసు నుంచి బయటపడటానికి న్యాయపోరాటం చేస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.