
జమ్మూ కాశ్మీర్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, చీనాబ్ వంతెన ప్రారంభోత్సవం సందర్భంగా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు. బ్రిటిష్ వారు కూడా చేయలేనిది మన ప్రధాని మోదీ చేశారని ఆయన అన్నారు. చీనాబ్ వంతెన ప్రాజెక్టు పూర్తవ్వడం అందరి కల అని, దానిని ప్రధాని మోదీ ఈరోజు నెరవేర్చారని అన్నారు. శుక్రవారం జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలో చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెనను ప్రధాని మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ప్రారంభించారు. దీని తరువాత, అంజి బ్రిడ్జి, కట్టర్ వద్ద కాశ్మీర్ మొట్టమొదటి రైలు వందే భారత్ను కూడా ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు.
పహల్గామ్ దాడి తరువాత జమ్ముకశ్మీర్లో తొలిసారి పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ రూ. 46 వేల కోట్ల అభివృధ్ది ప్రాజెక్ట్లను ప్రారంభించారు. జమ్ముకశ్మీర్లో చినాబ్ వంతెను ప్రారంభించిన ప్రధాని మోదీ తరువాత.. కాట్రా-శ్రీనగర్ వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు. వందేభారత్ రైలును జెండా ఊపారు. తరువాత వందేభారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేశారు. విద్యార్ధులతో ఆయన ముచ్చటించారు. ఈ రైలుతో శ్రీనగర్ నుంచి వైష్ణోదేవి ఆలయం ఉన్న కట్రాకు మూడు గంటల్లో చేరుకునే అవకాశం లభిస్తుంది.
గతంలో శ్రీనగర్ నుంచి ఆరు గంటలు.. ఒక్కోసారి 12 గంటల సమయం పట్టేది. కాని ఇప్పుడు మూడు గంటల్లోనే కట్రాకు చేరుకోవచ్చు. అంతేకాకుండా వర్షాకాలంలో రోడ్డు మార్గంలో ప్రయాణం చేయడం చాలా కష్టం.. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా ఇప్పడు ఈ మార్గంలో ప్రయాణం చేయవచ్చు. ప్రపంచంలోనే ఎత్తయిన చినాబ్ రైల్వే బ్రిడ్జిని జాతికి అంకితం చేశారు మోదీ . ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా చినాబ్ నది నుంచి 359 మీ. ఎత్తులో ఈ వంతెనను నిర్మించారు. నిర్మాణానికి కేంద్రం రూ.1,486 కోట్లు ఖర్చు చేసింది. ఈ వంతెన ప్రారంభోత్సవంతో.. భారత రైల్వే నెట్వర్కుతో జమ్మూకశ్మీర్ పూర్తిగా అనుసంధానం అయ్యింది. ఆపరేషన్ సింధూర్తో భారత్ సత్తా ప్రపంచానికి తెలిసిందన్నారు మోదీ. రక్షణరంగంలో ఆత్మ నిర్భర్ భారత్కు ఇది నిదర్శనమన్నారు. రక్షణరంగంలో ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశాల్లో భారత్ నెంబర్వన్ కాబోతుందన్నారు.
ఈ నేపథ్యంలోనే, ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రశంసిస్తూ, బ్రిటిష్ వారు చేయలేని పనిని ప్రధాని మోదీ పూర్తి చేశారని అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైనప్పుడు 8వ తరగతిలో ఉన్నానని, ఇప్పుడు తనకు 55 ఏళ్లు అని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల జమ్మూ కాశ్మీర్ చాలా ప్రయోజనం పొందుతుందని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో స్థానిక ప్రజలు చాలా ప్రయోజనాలను పొందబోతున్నారు. చీనాబ్ వంతెన రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. ఈ కల చాలా దశాబ్దాలుగా కనిపిస్తోందని ఒమర్ అన్నారు. బ్రిటిష్ వారు కూడా దీని గురించి కలలు కన్నారు. కానీ, బ్రిటిష్ వారు పూర్తి చేయలేనిది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో నెరవేరిందని అన్నారు.
ఈ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేస్తుందని ఒమర్ అబ్దుల్లా అన్నారు. దీని వల్ల రాష్ట్ర రైతులకు, ముఖ్యంగా ఆపిల్ వ్యాపారం చేసే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పుడు కాశ్మీర్లో పండించే ఆపిల్లు దేశంలోని వివిధ ప్రాంతాలకు సులభంగా చేరుకోగలవు. ఇది దేశ ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరుస్తుంది. దీనివల్ల ఆదాయం పెరగడమే కాకుండా యువతకు ఉపాధి కూడా లభిస్తుందని ఆయన అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..